గోద్రేజ్, శాంసంగ్‌ బంపర్‌ బొనాంజా

28 Jul, 2018 00:57 IST|Sakshi

7–8% తగ్గిన పలు గృహోపకరణాల ధరలు 

ముంబై: పండుగ సీజన్‌ కంటే ముందుగానే  గృహోపకరణాల కంపెనీలు కస్టమర్లకు బంపర్‌  ఆఫర్లు తీసుకొచ్చాయి. గోద్రేజ్‌ అప్లియెన్సెస్‌   పలు ఉత్పత్తులపై 8 శాతం వరకు తగ్గింపును ప్రకటించింది. శుక్రవారం (27 జూలై, 2018) నుంచి వాషింగ్‌ మెషీన్లు, మైక్రోవేవ్‌ ఓవెన్లు, చెస్ట్‌ ఫ్రీజర్స్‌ (ఫ్రిజ్‌)లపై డిస్కౌంట్స్‌ ఇస్తున్నట్లు గోద్రేజ్‌ అప్లియెన్సెస్‌ బిజినెస్‌ హెడ్, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కమల్‌ నంది ప్రకటించారు. గడిచిన వారంలో 15 రకాల గృహోపకరణాలపై జీఎస్‌టీ కౌన్సిల్‌ పన్ను రేట్లను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన నేపథ్యంలో ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు అందించనున్నట్లు వివరించారు. 

శాంసంగ్‌ డిస్కౌండ్‌ సందడి...
ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ కూడా జీఎస్‌టీ ప్రయోజనాలను కస్టమర్లకు అందిస్తోంది. టీవీ, వాషింగ్‌ మెషీన్, ఫ్రిజ్‌ల ధరలు 7.81 శాతం మేర తగ్గినట్లు శాంసంగ్‌ ఇండియా కన్సూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ భుటానీ ప్రకటించారు. ‘తగ్గిన జీఎస్‌టీ రేటు ప్రయోజనాన్ని కస్టమర్లకు అందిస్తున్నాం. ఈ నిర్ణయం వల్ల పండుగ సీజన్‌లో అమ్మకాలు మరింత పెరుగుతాయని భావిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు.   

మరిన్ని వార్తలు