ముంబై: ప్రతి నెలా రెండు, నాలుగో శనివారాలు బ్యాంకులకు సెలవు దినాలు కావడంతో ఆయా రోజుల్లో ఇకపై ఆర్టీజీఎస్ సేవలు కూడా అందుబాటులో ఉండవని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. మిగతా శనివారాల్లో మాత్రం పూర్తిగా రోజంతా సేవలు వినియోగించుకోవచ్చని పేర్కొంది. అలాగే ఆర్టీజీఎస్ వేళల్లో కూడా మార్పులు చేసినట్లు ఆర్బీఐ వివరించింది.
దీని ప్రకారం రెండో, నాలుగో శనివారాలు మినహా మిగతా అన్ని రోజుల్లో కస్టమర్ల లావాదేవీలకు సంబంధించి ఆర్టీజీఎస్ వేళలు ఉదయం 8 గం. ల నుంచి సాయంత్రం 4.30 గం.ల దాకా ఉంటాయి. ఇప్పటిదాకా ఈ కటాఫ్ సమయం మధ్యాహ్నం 2 గం.ల దాకానే ఉంది. ఆన్లైన్లో రూ. 2 లక్షలకు మించి నగదు బదిలీ చేసేందుకు ఉపయోగపడే విధానాన్ని ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్)గా వ్యవహరిస్తారు.