లండన్: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .. బ్రిటన్లో తమ అనుబంధ బ్యాంకు ఎస్బీఐ (యూకే) లిమిటెడ్ను ప్రారంభించింది. దీనిపై తొలినాళ్లలో 225 మిలియన్ పౌండ్లు ఇన్వెస్ట్ చేయనుంది.
బ్రెగ్జిట్ అనంతరం కూడా లండన్ కీలకమైన ఆర్థిక కేంద్రంగానే కొనసాగగలదని తాము భావిస్తున్నట్లు ఎస్బీఐ యూకే రీజనల్ హెడ్ సంజీవ్ చద్ధా తెలిపారు. విదేశీ మార్కెట్ల అనిశ్చితి నుంచి దేశీ డిపాజిటర్లకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో విదేశీ బ్యాంకులు తమ దగ్గర అనుబంధ బ్యాంకులు ఏర్పాటు చేసేలా బ్రిటన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
దీనివల్ల తమ వ్యయాలు భారీగా పెరిగిపోతాయని ఇతర విదేశీ బ్యాంకుల శాఖలు ఆందోళన చెందుతున్నాయి. బ్రిటన్లో తమ కార్యకలాపాలను పునఃసమీక్షించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్బీఐ.. అనుబంధ బ్యాంకును ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎస్బీఐకి లండన్లో ఏడు, మరో అయిదు నగరాల్లో శాఖలు ఉన్నాయి.