త్వరలోనే ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ!

18 Feb, 2020 07:46 IST|Sakshi

ఈ నెల చివర్లో...

లేదా మార్చి మొదట్లో ఆఫర్‌...

ఇష్యూ సైజు రూ.6,000 కోట్లపైనే

ముకేశ్‌ ట్రెండ్స్‌ ఐపీఓకు సెబీ ఓకే  

న్యూఢిల్లీ: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) క్రెడిట్‌ కార్డ్‌ విభాగం, ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ఈ నెల చివరి వారంలో గానీ, వచ్చే నెల మొదట్లో గానీ ఉండొచ్చని సమాచారం. ఈ ఐపీఓకు ఇటీవలనే మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఐపీఓలో రూ.500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. వీటితో పాటు 13.05 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో విక్రయిస్తారు. దీంట్లో ఎస్‌బీఐ 3.7 కోట్లు, కార్లైల్‌ గ్రూప్‌ 9.32 కోట్ల షేర్లను విక్రయిస్తాయి.  ఈ ఐపీఓ సైజు రూ.6,000 కోట్లకు మించి ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా.

జీఎమ్‌పీ రూ.296–298 రేంజ్‌లో
ఈ ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా కోటక్‌ మహీంద్రా క్యాపిటల్, యాక్సిస్‌ క్యాపిటల్, డీఎస్‌పీ మెరిల్‌ లించ్, నొముర ఫైనాన్షియల్‌ అడ్వయిజరీ, హెచ్‌ఎస్‌బీసీ సెక్యూరిటీస్, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ వ్యవహరిస్తున్నాయి. భారత్‌లో అత్యధికంగా క్రెడిట్‌ కార్డ్‌లు జారీ చేస్తున్న రెండో అతి పెద్ద కంపెనీ ఇదే. 18 శాతం మార్కెట్‌  వాటా ఈ కంపెనీదే. ఐపీఓ ఇష్యూ ధర రూ.690–750 రేంజ్‌లో ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం గ్రే మార్కెట్‌ ప్రీమియమ్‌(జీఎమ్‌పీ) రూ.296–298గా ఉందని సమాచారం.

ముకేశ్‌ ట్రెండ్స్‌ ఐపీఓకు సెబీ ఓకే...
ఎస్‌బీఐ కార్డ్స్‌తో పాటు ముకేశ్‌ ట్రెండ్స్‌ లైఫ్‌స్టైల్‌ ఐపీఓకు కూడా సెబీ ఆమోదం తెలిపింది. ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ కోటి వరకూ ఈక్విటీ  షేర్లను జారీ చేయనుంది. ఈ ఐపీఓ సూజు రూ.70–90 కోట్ల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

మరిన్ని వార్తలు