ఈ ఏడాది వృద్ధి 5 శాతం

13 Nov, 2019 05:06 IST|Sakshi

క్యూ2లో 4.2 శాతానికి పడిపోవచ్చు

జీడీపీపై ఎస్‌బీఐ ఎకోరాప్‌ అంచనాలు

న్యూఢిల్లీ: దేశ జీడీపీ వృద్ధి అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019–20) 5 శాతానికి తగ్గిస్తున్నట్టు ఎస్‌బీఐ ఆర్థిక పరిశోధన విభాగం ఎస్‌బీఐ ఎకోరాప్‌ స్పష్టంచేసింది. వృద్ధి 6.1 శాతం మేర ఉంటుందని గతంలో వేసిన అంచనాలను సంస్థ సవరించింది. మరీ ముఖ్యంగా రెండో త్రైమాసికంలో (జూలై–సెపె్టంబర్‌) జీడీపీ వృద్ధి 4.2 శాతానికి పడిపోవచ్చని పేర్కొనడాన్ని గమనించాలి. మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) జీడీపీ వృద్ధి 5 శాతానికి క్షీణించిన విషయం తెలిసిందే.

ఇది 2013 మార్చి తర్వాత అత్యంత కనిష్ట వృద్ధి రేటు. ఆటోమొబైల్‌ అమ్మకాలు తగ్గిపోవడం, విమాన ప్రయాణికుల్లో క్షీణత, ప్రధాన రంగాల్లో వృద్ధి ఫ్లాట్‌గా ఉండటం, నిర్మాణం, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు తగ్గిపోవడం వంటివి రెండో త్రైమాసికంలో వృద్ధిని తగ్గించనున్నట్లు ఎస్‌బీఐ ఎకోరాప్‌ పేర్కొంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో మాత్రం వృద్ధి రేటు 6.2 శాతానికి పుంజుకుంటుందని అంచనా వేసింది.  

కీలక రేట్లలో భారీ కోత?
వృద్ధికి ఊతమిచ్చేందుకు గాను ఆర్‌బీఐ డిసెంబర్‌లో జరిగే పాలసీ సమీక్షలో భారీ రేట్ల కోత దిశగా అడుగు వేయవచ్చని ఎస్‌బీఐ ఎకోరాప్‌ తన నివేదికలో పేర్కొంది. ఆర్‌బీఐ ఈ ఏడాది ఇప్పటి వరకు 1.35% మేర కీలక రేట్లను తగ్గించింది. అక్టోబర్‌ పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ సైతం 2019–20 జీడీపీ వృద్ధి అంచనాలను 6.1 శాతానికి తగ్గించడం గమనార్హం.

మరిన్ని వార్తలు