జెట్‌ ఖాతాలపై ఎస్‌బీఐ ఫోరెన్సిక్‌ ఆడిట్‌

15 Dec, 2018 05:34 IST|Sakshi

ముంబై: తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ ఖాతాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు ఎస్‌బీఐ ఆదేశించింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ బ్యాంకుల నుంచి రూ.8,000 కోట్లకు పైగా రుణాలను తీసుకోగా, ఎస్‌బీఐ లీడ్‌ బ్యాంకర్‌గా ఉంది. చమురు ధరల పెరుగుదలతో జెట్‌ ఎయిర్‌వేస్‌ గత మూడు త్రైమాసికాలుగా రూ.1,000 కోట్లకు పైగా నష్టాలను నమోదు చేస్తోంది. తీవ్ర స్థాయిలో నిధుల కటకటను ఎదుర్కొంటున్న ఈ సంస్థ తాజా నిధుల సమీకరణ యత్నాలను కూడా చేస్తుండటం గమనార్హం.

ఈ నేపథ్యంలో 2014 ఏప్రిల్‌ నుంచి 2018 మార్చి 31 వరకు జెట్‌ ఎయిర్‌వేస్‌ ఖాతాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించాలని ఎస్‌బీఐ నిర్ణయించడం గమనార్హం. జెట్‌ ఎయిర్‌వేస్‌ ఖాతాల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఓ ప్రజావేగు ఇచ్చిన సమాచారంతో ఎస్‌బీఐ ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు ఆదేశించినట్టు సమాచారం. అంతేకాదు, ఈఅండ్‌వై సంస్థ ఇప్పటికే దీన్ని ప్రారంభించినట్టు బ్యాంకు వర్గాలు తెలిపాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రమోటర్‌ నరేష్‌ గోయల్‌ రూ.5,000 కోట్లను మింగేసినట్టు ఆరోపణలు కూడా వచ్చాయి. సెప్టెంబర్‌ క్వార్టర్‌ నాటికి ఈ సంస్థ రుణ భారం రూ.8,052 కోట్లుగా ఉంది.

మరిన్ని వార్తలు