న్యూఢిల్లీ: సైబర్ దాడుల కారణంగా ఆర్థిక నష్టాలు, ప్రతిష్ట దెబ్బతినడం మొదలైన వాటి నుంచి వ్యాపార సంస్థలకు రక్షణనిచ్చేలా ప్రత్యేకంగా బీమా పాలసీని అందుబాటులోకి తెచ్చినట్లు ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. ప్రారంభ దశలో చిన్న, మధ్య తరహా సంస్థలపై దృష్టి పెడతామని, ఆ తర్వాత పెద్ద కార్పొరేట్ సంస్థలకూ అందించనున్నామని సంస్థ వెల్లడించింది.
ప్రస్తుతం అన్ని రకాలు, పరిమాణాల వ్యాపార సంస్థలకు సైబర్ దాడుల ముప్పు పెరిగిపోయిందని, ఈ నేపథ్యంలోనే అలా వాటిల్లే నష్టాన్ని భర్తీ చేసేందుకు అనువుగా ఈ పాలసీని రూపొందించడం జరిగిందని ఎస్బీఐ జనరల్ తెలిపింది.