రూ.1200 కోట్లు చెల్లించండి: ఎస్‌బీఐ

12 Jun, 2020 12:15 IST|Sakshi

అనిల్‌ అంబానీపై ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించిన ఎస్‌బీఐ

అనిల్ అంబానీ నుంచి రూ.1,200 కోట్లకు పైగా వసూలు చేసేందుకు ఎస్‌బీఐ సిద్ధమైంది. గతంలో రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ తీసుకున్న రుణాలకు అనిల్‌ అంబానీ వ్యక్తిగత హామీ ఇచ్చారని., ఇప్పుడు వ్యక్తిగత హామి ఇచ్చిన రుణాన్ని అతనే చెల్లించాలంటూ ఎస్బీఐ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. బీఎస్‌వీ ప్రకాష్ కుమార్ అధ్యక్షతన ఎన్‌సీఎల్‌టీ బెంచ్ గురువారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అనిల్‌ తరుపున న్యాయవాదులు తమకు కొన్ని రోజుల గడువు కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన బెంచ్ వారికి వారం రోజుల గడువు ఇచ్చింది. 

"ఈ విషయం రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ సంస్థలు పొందిన కార్పొరేట్ రుణానికి సంబంధించినది. అంతేకాని ఇది అంబానీ వ్యక్తిగత రుణానికి సంబంధించనది కాదు. ఈ అంశంపై అంబానీ తగిన విధంగా స్పందిస్తారు.’’ అని అనిల్ అంబానీ అధికార ప్రతినిధి ఒక ఈ-మెయిల్‌ ద్వారా స్పందించారు.   

అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు ఇచ్చిన రుణాలకు వ్యక్తిగత హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆర్‌కామ్‌ దివాళా కేసు ఎన్‌సీఎల్‌టీ విచారణలో ఉంది. వ్యక్తిగత హామి ఇచ్చిన రుణాన్ని రాబట్టాలనే యోచనలో ఉన్నట్లు ఎస్‌బీఐ అధికారి ఒకరు తెలిపారు. వ్యక్తిగత దివాలా కేసులపై నిషేధం లేనందున, ఈ విషయంపై అత్యవసర విచారణ జరపాల్సిందిన ఎన్‌సీఎల్‌టీని కోరినట్లు అతను తెలిపారు. అలాగే వ్యక్తిగత ఖాతాలు వివరాలు, వాటి పనితీరు లాంటి అంశాలపై వ్యాఖ్యానించకూడదనేది బ్యాంక్ పాలసీ కాబట్టి పూర్తి వివరాలను తాను వెల్లడించలేనని ఎస్‌బీఐ అధికారి చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు