ఎస్‌బీఐ లాభం రూ.4,709 కోట్లు

2 Feb, 2019 01:39 IST|Sakshi

గత క్యూ3లో  రూ.1,887 కోట్ల నికర నష్టాలు  

21 శాతం వృద్ధితో రూ.22,691 కోట్లకు నికర వడ్డీ ఆదాయం 

ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ వెల్లడి

ముంబై: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)  ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.4,709  కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.1,887 కోట్ల నికర నష్టాలు వచ్చాయని ఎస్‌బీఐ తెలిపింది. కేటాయింపులు భారీగా తగ్గడం, రుణ నాణ్యత మెరుగుపడటం వల్ల భారీ నికర లాభం సాధించామని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ వెల్లడించారు.  మొత్తం ఆదాయం రూ.74,191 కోట్ల నుంచి రూ.84,350 కోట్లకు పెరిగిదన్నారు.  స్టాండో లోన్‌ పరంగా చూస్తే, గత క్యూ3లో రూ.2,416 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.3,955 కోట్లకు పెరిగిందని వివరించారు. నికర వడ్డీ ఆదాయం 21 శాతం వృద్ధితో రూ.22,691 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. దీంతో నికర వడ్డీ మార్జిన్‌ 2.67 శాతం నుంచి 2.92 శాతానికి చేరిందన్నారు. 

మెరుగుపడిన రుణనాణ్యత  
ఈ క్వార్టర్లో నికర లాభం, వ్యాపార వృద్ధి, రుణ నాణ్యత.. ఇలా అన్ని అంశాల్లో అద్భుతమైన పనితీరు సాధించామని రజనీశ్‌ కుమార్‌ వెల్లడించారు.  గత క్యూ3లో 10.35 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 8.71 శాతానికి తగ్గాయని తెలిపారు. నికర మొండి బకాయిలు 5.61 శాతం నుంచి 3.95 శాతానికి చేరాయని వివరించారు. మరికొన్ని మొండి బకాయిల రిజల్యూషన్‌ దాదాపు చివరి దశకు చేరిందని, ఇవి పరిష్కారమైతే స్థూల మొండి బకాయిలు 7 శాతానికి, నికర మొండి బకాయిలు 3 శాతానికి దిగివస్తాయని పేర్కొన్నారు.  గత క్యూ3లో రూ.17,964 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ3లో రూ.14,144 కోట్లకు తగ్గాయని, అలాగే   మొత్తం కేటాయింపులు  కూడా మూడో వంతుకు తగ్గాయని వివరించారు. 

10కి 9 మార్కులు: ఫ్యాప్సీ 
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బడ్జెట్‌ బాగుందని ఫ్యాప్సీ అభివర్ణించింది. సమతుల బడ్జెట్‌ అని ఫ్యాప్సీ ప్రెసిడెంట్‌ అరుణ్‌ లుహారుకా అభిప్రాయపడ్డారు. 10కిగాను 9 మార్కులు ఇస్తున్నట్టు చెప్పారు. అన్ని రంగాలను ప్రోత్సహించేలా ఉందని సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కరుణేంద్ర జాస్తి తెలిపారు. రూ.5 లక్షల వార్షిక వేతనం వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వడం మధ్యతరగతికి పెద్ద ఊరట అని అన్నారు. జీఎస్‌టీ వసూళ్లు పెరుగుతున్నాయి కాబట్టి బడ్జెట్‌ హామీల భారం పెద్దగా ఉండకపోవచ్చని చెప్పారు. పరిశ్రమలకు ఇప్పటికే పలు ప్రయోజనాలను ఈ ప్రభుత్వం అందిస్తోందని ఫ్యాప్సీ ప్రతినిధులు తెలిపారు. ఈ ప్రయోజనాలను కొనసాగించడం కూడా పెద్ద ఉపశమనమని వివరించారు.    

మరిన్ని వార్తలు