మొబైల్‌ బ్యాంకింగ్‌ లావాదేవీల జోరు!

13 Jun, 2018 00:52 IST|Sakshi

ముంబై: మొబైల్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలు జోరుగా పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొబైల్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలు 3,360 లక్షలకు చేరతాయని, వీటి విలువ రూ.7,56,000 కోట్లుగా ఉంటుందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) అంచనా వేస్తోంది.

గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,706 లక్షల మొబైల్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలు జరిగాయని, వీటి విలువ రూ.6,00,502 కోట్లని ఎస్‌బీఐ ఎమ్‌డీ, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి తమ మొబైల్‌ బ్యాంకింగ్‌ చానెల్‌పై నమోదు చేసుకున్న ఖాతాదారుల సంఖ్య 305 లక్షలకు పైగా పెరిగిందని పేర్కొన్నారు.

స్మార్ట్‌ఫోన్ల వినియోగం బాగా పెరుగుతోందని, టెలికం కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ కారణంగా చౌక ధరల్లోనే డేటా టారిఫ్‌లు లభిస్తున్నాయని, వై–ఫై, 4జీ నెట్‌వర్క్‌ల విస్తరణ కారణంగా మొబైల్‌ బ్యాంకింగ్‌ రంగంలో తమ అగ్రస్థానాన్ని కొనసాగించగలమని వివరించారు. కాగా మొత్తం బ్యాంకింగ్‌ లావాదేవీల్లో 20 శాతం మాత్రమే బ్రాంచ్‌ల ద్వారా జరుగుతున్నాయని ఇటీవలే ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు