ఎన్‌ఎస్‌ఈలో ఎస్‌బీఐ వాటా విక్రయం!

18 Dec, 2015 00:38 IST|Sakshi

 న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్‌ఎస్‌ఈ) లో తనకున్న వాటాను విక్రయించాలని ఎస్‌బీఐ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై విలువ పొందే ప్రయత్నాల్లో ఎన్‌ఎస్‌ఈలో వాటా విక్రయం ఒకటని ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య చెప్పారు. బ్యాంకింగ్‌కు సంబంధించిన వ్యాపారాలపైనే దృష్టిసారించనున్నామని తెలియజేశారు.

ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు బ్యాంకింగ్ రంగానికి సంబంధించి కీలకం కాని  తమ ఇన్వెస్ట్‌మెంట్లను విక్రయించాలని, ఇలా చేస్తే బ్యాంక్‌ల పెట్టుబడులు తిరిగి లాభాలతో బ్యాంకులకే వస్తాయని ఇటీవలే ఆర్థిక సేవల విభాగం వెల్లడించింది. ఎన్‌ఎస్‌ఈ ప్రారంభమైనప్పుడు కొంత మొత్తం ఇన్వెస్ట్ చేశామని, ఇప్పుడు ఎన్‌ఎస్‌ఈ భారీ సంస్థగా ఎదిగిందని, ఇప్పుడు తమ ఇన్వెస్ట్‌మెంట్ విలువను పొందాలనుకుంటున్నామని అరుంధతీ భట్టాచార్య ఒక ప్రముఖ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌ఈలో ఎస్‌బీఐకు 15% వాటా ఉంది. ఈ వాటా విక్రయం ద్వారా ఎస్‌బీఐకు బిలియన్ డాలర్లు వస్తాయని అంచనా.

మరిన్ని వార్తలు