అంబానీ బ్రదర్స్‌ మెగా డీల్‌కు బ్రేక్‌: షేర్లు ఢమాల్‌

22 Mar, 2018 13:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  అప్పుల సంక్షోభంలో చిక్కుకున్న రిలయన్స్‌ కమ్యూనికేషన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.  రిలయన్స్‌ జియోకు ఆస్తుల అమ్మకంపై స్టేను ఎత్తివేసేందుకు నిరాకరిస్తూ  గురువారం ఆదేశాలు జారీ చేసింది.  ఈ విక్రయం తన తుది ఆదేశానికి లోబడి ఉంటుందని కోర్టు తెలిపింది,  తుది  ఆదేశాలవరకు యథాతధ స్థితిని కొనసాగించాలని  సుప్రీం ఆదేశించింది.   తద్వారా తన అనుమతిలేనిదే  ఈ డీల్‌ను పూర్తి చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది.  

సుమారు రూ.39వేల కోట్ల రుణభారాన్ని  తగ్గించుకునే  వ్యూహంలో భాగంగా  తన వైర్‌లెస్‌ స్పెక్ట్రం, టవర్, ఫైబర్‌, మీడియా కన్వర్జెన్స్ నోడ్ (ఎంసిఎన్) ఆస్తులను జియోకు విక్రయించనున్నట్టు ఆర్‌కాం ప్రకటించింది. అయితే ట్రిబ్యునల్ ఆర్డర్‌కు భిన్నంగా ముందస్తు అనుమతి లేకుండా దాని ఆస్తుల విక్రయం లేదా బదిలీకి కుదరదంటూ  ఈ నెల 8న ముంబై హైకోర్టు  ఈ డీల్‌ను తిరస్కరించింది.  ఆర్‌కాంనుంచి  వెయ్యికోట్లకుపైగా బకాయి రావాల్సిన దేశీయ చిప్‌ మేకర్‌ ఎరిక్‌సన్‌ ట్రిబ్యునల్‌ను  ఆశ్రయించింది.  అయితే ఆర్‌కాంకు మద్దతుగా నిలిచిన  ఎస్‌బీఐ ట్రిబ్యునల్ ఆర్డర్‌ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.  ఆస్తుల అమ్మకానికి అనుమతి నివ్వాల్సిందిగా కోరింది.  దీనిపై స్పందించిన సుప్రీం  ముంబై హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ తాజా ఆదేశాలిచ్చింది.

కాగా ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ( జియో) కు కంపెనీ ఆస్తులను విక్రయించాలని ఆర్‌కాం అధినేత అనిల్ అంబానీ నిర్ణయించారు.  అప్పుల ఊబినుంచి బయటపడేందుకు  ఈ నిర్ణయం తీసుకున్నామని గత ఏడాది డిసెంబర్‌లో  ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు  ఈ ఆదేశాల నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లో ఆర్‌కాం భారీ పతనాన్ని నమోదు చేసింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో  5శాతానికి పైగా నష్టపోయింది.

మరిన్ని వార్తలు