మోసపూరిత సంస్థల ఆస్తుల వేలం

4 Jan, 2020 03:55 IST|Sakshi

ఇన్వెస్టర్ల పెట్టుబడులను రాబట్టుకునేందుకు సెబీ చర్య

న్యూఢిల్లీ: రాయల్‌ ట్వింకిల్‌ స్టార్‌ క్లబ్‌ లిమిటెడ్, సిట్రస్‌ చెక్‌ ఇన్స్‌ లిమిటెడ్‌ సంస్థల ఆస్తులను ఈ నెల 23న సెబీ వేలం వేయనుంది. మోసపూరిత ప్రకటనలతో ఇన్వెస్టర్ల నిధులను ఈ సంస్థలు కొల్లగొట్టడంతో, వాటి వసూలుకు సెబీ ఈ చర్య చేపడుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆస్తులను వేలం వేస్తున్నట్టు సెబీ శుక్రవారం ప్రకటించింది. వేలానికి ఉంచే ఈ రెండు సంస్థల ఆస్తులు ముంబై, బెంగళూరు, కేరళలో ఉన్నాయి. ముంబైలోని లోయర్‌పారెల్‌లో ఉన్న ప్రాపర్టీ రిజర్వ్‌ ధర రూ.25.6 కోట్లు కాగా, లోనవాలాలో ఉన్న ప్రాపర్టీ రిజర్వ్‌ ధర రూ.35.25 కోట్లు, బెంగళూరులో ప్రాపర్టీ రిజర్వ్‌ ధర రూ.32 కోట్లు, కేరళలోని అలప్పుజలో ప్రాపర్టీ రిజర్వ్‌ ధర 15.3 కోట్లుగా ఉంది. టైమ్‌ షేర్‌ హాలిడే ప్లాన్ల పేరుతో అక్రమంగా రూ.2,656 కోట్లను సమీకరించడంతో రాయల్‌ ట్వింకిల్‌పై, ఆ సంస్థ నలుగురు డైరెక్టర్లపై నాలుగేళ్లపాటు సెబీ నిషేధం విధిస్తూ 2015 ఆగస్ట్‌లోనే ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. నిబంధనలు ఉల్లంఘించడంతో సిట్రస్‌ చెక్‌ ఇన్స్‌పై రూ.50 లక్షల జరిమానా విధించడంతోపాటు.. ప్రజల నుంచి నిధులు సమీకరించకూడదని లోగడ ఆదేశించింది.   

మరిన్ని వార్తలు