మ్యూచువల్‌ ఫండ్స్‌ చార్జీలను తగ్గించిన సెబీ

5 Jun, 2018 00:44 IST|Sakshi

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ వసూలు చేసే అదనపు ఎక్స్‌పెన్స్‌ చార్జీలను మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ బాగా తగ్గించింది. గతంలో 20 బేసిస్‌ పాయింట్లుగా ఉన్న ఈ అడిషనల్‌ ఎక్స్‌పెన్స్‌ చార్జీని సెబీ 5 బేసిస్‌ పాయింట్లకు తగ్గించింది. అన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ స్కీమ్‌లకు ఇది వర్తిస్తుందని సెబీ పేర్కొంది.

సెబీ ఈ నిర్ణయం కారణంగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ వ్యయాలు మరింతగా తగ్గుతాయని, ఫలితంగా ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌  మరింతగా పెరుగుతాయని నిపుణులంటున్నారు. అయితే డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం కమీషన్లు తగ్గవచ్చని వారు చెప్పారు. వంద బేసిస్‌ పాయింట్లు 1 శాతానికి సమానం.

నిబంధనల్లో మార్పులు...
ఇన్వెస్టర్‌ ఒక ఫండ్‌ నుంచి వైదొలిగేటప్పుడు (ఫండ్‌ యూనిట్లను విక్రయం) ఆ ఫండ్‌ నిర్వహణ ఆస్తుల మొత్తంలో 20 బేసిస్‌ పాయింట్లను ఎగ్జిట్‌ లోడ్‌గా చెల్లించాలని సెబీ 2012లో నిబంధన విధించింది. తాజాగా ఈ ఎగ్జిట్‌ లోడ్‌ను 5 బేసిస్‌ పాయింట్లకు పరిమితం చేసింది. అంతేకాక మ్యూచువల్‌ ఫండ్లకు సంబంధించిన వివరాల వెల్లడి నిబంధనలను కూడా సరళీకరించింది.

మరిన్ని వార్తలు