ప్రభుత్వానికి వెసులుబాటు ఇచ్చిన సెబీ
న్యూఢిల్లీ: యూనియన్ బ్యాంక్ విషయంలో ఓపెన్ ఆఫర్ ఇవ్వకుండా ప్రభుత్వానికి మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ మినహాయింపునిచ్చింది. యూనియన్ బ్యాంక్లో ప్రభుత్వం రూ.4,112 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది. ఈ పెట్టుబడులకు ప్రతిగా యూనియన్ బ్యాంక్ ప్రిఫరెన్షియల్ షేర్లను ప్రభుత్వానికి జారీ చేస్తుంది. దీంతో యూనియన్ బ్యాంక్లో ప్రస్తుతం 67.43 శాతంగా ఉన్న ప్రభుత్వం వాటా 6.55 శాతం పెరిగి 73.98 శాతానికి చేరుతుంది.
ఫలితంగా టేకోవర్ నిబంధనలు వర్తించి ప్రభుత్వం ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సి వస్తుంది. అయితే ప్రభుత్వ పెట్టుబడుల కారణంగా ప్రజల వద్ద ఉండే ఈక్విటీ షేర్ల సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండనందున ప్రభుత్వం ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సిన అవసరం లేదని సెబీ స్పష్టతనిచ్చింది. ఓపెన్ ఆఫర్ విషయంలో మినహాయింపును ఇచ్చింది.