రూ.625 కోట్లు చెల్లించండి

1 May, 2019 00:19 IST|Sakshi

కో–లొకేషన్‌ కేసులో ఎన్‌ఎస్‌ఈకి సెబీ ఆదేశాలు

2014 ఏప్రిల్‌ నుంచి వడ్డీతో సహా చెల్లించాలి

ఇద్దరు మాజీ చీఫ్‌లపై ఐదేళ్లు నిషేధం కూడా

న్యూఢిల్లీ: ట్రేడింగ్‌ సమాచారం కొందరికి అందరికన్నా ముందుగా లభ్యమయ్యే అవకాశం కల్పించిన కోలొకేషన్‌ కేసులో... రూ.625 కోట్లు పరిహారంగా చెల్లించాలంటూ నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజీని (ఎన్‌ఎస్‌ఈ) సెబీ ఆదేశించింది. ఎన్‌ఎస్‌ఈకి లోగడ ఎండీగా పనిచేసిన రవి నారాయణ్, సీఈవోగా వ్యవహరించిన చిత్రా రామకృష్ణలను తమ పదవీ కాలంలో పొందిన వేతనంలో 25 శాతాన్ని తిరిగి చెల్లించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అలాగే, వీరికి ఏ లిస్టెడ్‌ కంపెనీతోనూ లేదా మార్కెట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో ముడిపడిన సంస్థతోనూ లేదా మార్కెట్‌ ఇంటర్‌ మీడియరీతో ఐదేళ్ల పాటు సంబంధాలు ఉండకూడదని స్పష్టం చేసింది. ఆరు నెలల పాటు సెక్యూరిటీల మార్కెట్‌లోకి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రవేశించకుండా ఎన్‌ఎస్‌ఈని నిషేధించింది. అంతేకాకుండా తరచుగా తన వ్యవస్థలను ఆడిట్‌ కూడా చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు సెబీ 104 పేజీలతో కూడిన ఆదేశాలను మంగళవారం జారీ చేసింది. ఎన్‌ఎస్‌ఈ కో లొకేషన్‌ కింద కొందరికి అధిక ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్‌ సదుపాయాలను కల్పించిందంటూ 2015లో దాఖలైన ఫిర్యాదుపై సెబీ దర్యాప్తు నిర్వహించిన విషయం గమనార్హం. 

14 మందికి విముక్తి..: కో–లొకేషన్‌ కింద జరిగిన డేటా సరఫరాతో ఆర్జించిన లాభాల నుంచి రూ.625 కోట్లను చెల్లించడంతో పాటు, దీనికి 2014 ఏప్రిల్‌ 1 నుంచి 12% వడ్డీని సైతం చెల్లించాలని ఎన్‌ఎస్‌ఈని సెబీ ఆదేశించింది. ఈ మొత్తాన్ని పెట్టుబడిదారుల రక్షణ, విద్యా కార్యక్రమ నిధికి జమ చేయాలని స్పష్టం చేసింది. ఈ కేసులో సెబీ మొత్తం 16 మందికి షోకాజు నోటీసులు జారీ చేయగా, వీరిలో 14 మందికి విముక్తి లభించింది. ‘‘ఎన్‌ఎస్‌ఈ మోసపూరిత, అనుచిత విధానాలకు పాల్పడడం ద్వారా సెబీ నియంత్రణలను ఉల్లంఘించింది. టిక్‌ బై టిక్‌ (టీబీటీ) డేటా ఆర్కిటెక్చర్‌ను ఏర్పాటు చేసే విషయంలో ఎన్‌ఎస్‌ఈ తగినంత శ్రద్ధ వహించలేదన్నది సుస్పష్టం. దీని కారణంగా ఏర్పడిన ట్రేడింగ్‌ వాతావరణంలో జరిగిన సమాచార వ్యాప్తి అసమానం. దీన్ని పారదర్శకం, సమానత్వంగా పరిగణించడానికి లేదు’’ అని సెబీ పూర్తిస్థాయి సభ్యుడు జి మహాలింగం ఆదేశాల్లో పేర్కొన్నారు. మార్కెట్‌ సదుపాయాల సంస్థ అయిన ఎన్‌ఎస్‌ఈని ఇతర మార్కెట్‌ మధ్యవర్తిత్వ సంస్థలు, పార్టిసిపెంట్స్‌తో సమానంగా చూడరాదన్నారు. టీబీటీ డేటా వ్యాప్తి అన్నది 2010 జూన్‌ నుంచి 2014 మార్చి వరకు జరిగినట్టు సెబీ గుర్తించింది. కాగా, సెబీ ఆదేశాలను పరిశీలించి, న్యాయపరంగా వీలుంటే తదుపరి చర్యలు చేపడతామని ఎన్‌ఎస్‌ఈ అధికార ప్రతినిధి చెప్పారు.

►ఎన్‌ఎస్‌ఈ మాజీ ఎండీ రవి నారాయణ్, మాజీ సీఈవో చిత్రా రామకృష్ణలపై ఐదేళ్ల పాటు నిషేధం 
►రూ.625 కోట్లను 12% వడ్డీతో ఎన్‌ఎస్‌ఈ చెల్లించాలి. 
► ఆరు నెలల పాటు సెక్యూరిటీల మార్కెట్‌లోకి ఎన్‌ఎస్‌ఈ ప్రవేశంపై నిషేధం. ఈ కాలంలో ఎన్‌ఎస్‌ఈ ఐపీవోకు కూడా అవకాశం ఉండదు. 
►  సెబీ ఆదేశాలతో ఆరు నెలల పాటు స్టాక్స్, కమోడిటీల్లో నూతన డెరివేటివ్‌ల ప్రవేశానికి వీల్లేదు. 

మరిన్ని వార్తలు