సత్యం వ్యవహారం..

18 Jul, 2017 01:34 IST|Sakshi
సత్యం వ్యవహారం..

పీడబ్ల్యూసీపై త్వరలో సెబీ ఉత్తర్వులు!
న్యూఢిల్లీ: దాదాపు దశాబ్దం క్రితం నాటి సత్యం కంప్యూటర్స్‌ కుంభకోణంలో ఆడిటింగ్‌ అవకతవకలకు సంబంధించి ప్రైస్‌ వాటర్‌హౌస్‌ కూపర్స్‌పై (పీడ్లూ్యసీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. తుది ఉత్తర్వులు సిద్ధమవుతున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2000 నుంచి 2008 దాకా పీడబ్ల్యూసీ.. సత్యం కంప్యూటర్స్‌కి ఆడిటింగ్‌ సేవలు అందించింది. సత్యం కంప్యూటర్స్‌ అనేక సంవత్సరాల పాటు తమ ఖాతాల్లో అవకతవకలకు పాల్పడిన కుంభకోణం 2009 జనవరిలో బయటపడిన సంగతి తెలిసిందే. దీంతో అదే ఏడాది ఫిబ్రవరిలో పీడబ్ల్యూసీకి సెబీ షోకాజ్‌ నోటీసులిచ్చింది.

తాము సెబీ పరిధిలోకి రామంటూ పీడబ్ల్యూసీ .. బాంబే హైకోర్టును ఆశ్రయించింది. పీడబ్ల్యూసీ నిర్ధారించిన బ్యాలెన్స్‌ షీట్ల ఆధారంగానే సత్యం కంప్యూటర్స్‌లో మదుపు చేసిన ఇన్వెస్టర్లు.. దాని వైఖరి కారణంగా నష్టపోయారంటూ సెబీ వాదించింది. ఫలితంగా షోకాజ్‌ నోటీసులు జారీ చేసేందుకు సెబీకి పూర్తి అధికారాలు ఉంటాయంటూ న్యాయస్థానం పేర్కొంది. అప్పట్నుంచీ విచారణ కొనసాగుతూనే ఉంది. ఆరునెలల్లో విచారణ ప్రక్రియ పూర్తి చేయాలంటూ సుప్రీం కోర్టు ఈ ఏడాది జనవరిలో ఆదేశించడంతో సెబీ ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. మే–జూన్‌లో పీడబ్ల్యూసీ వర్గాలను పలు దఫాలుగా విచారించింది. అటు ప్రభుత్వం నుంచి కూడా సెబీకి పీడబ్ల్యూసీపై కొన్ని ఫిర్యాదులు వచ్చాయని, వాటిని కూడా పరిశీలించాలని కేంద్రం సూచించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు