100 కిలోమీటర్ల దూరంలో 2వేల ఎకరాల స్థలం ఎంపిక
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై మీనంబాక్కంలో రద్దీ నుంచి ప్రయాణికులకు విముక్తి కలిగించేందుకు రెండో విమానాశ్రయ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాంచీపురం జిల్లా సెయ్యూరులో రెండువేల ఎకరాల స్థలాన్ని తమిళనాడు ప్రభుత్వం ఎంపిక చేసింది. చెన్నై విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ, సర్వీసుల సంఖ్య పెరగడంతో కార్గో విమానాల్లో విపరీత మెన జాప్యం చోటుచేసుకుంటోంది.
రెండో విమానాశ్రయ ఏర్పాటు తప్పదనే నిర్ణయానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చాయి. చెన్నైకి 50 కిలోమీటర్ల దూరంలోని శ్రీపెరంబుదూరులో ఏర్పాటు చేయాలని చాలాకాలం చర్చ జరిగింది. తగినంత స్థలం అందుబాటులో లేకపోవడంతో వంద కిలోమీటర్ల దూరంలోని సెయ్యూరును ఎంపిక చేశారు. మీనంబాక్కం విమానాశ్రయాన్ని డొమెస్టిక్, సెయ్యూరు విమానాశ్రయాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా పరిగణించే అవకాశం ఉంది. ఎయిర్పోర్టు చుట్టూ ఉన్న ప్రాంతంలో ఏరోసిటీని ఏర్పాటు చేయాలని విమానయానశాఖ నిర్ణయించింది.