లాక్‌డౌన్‌ను ఎదుర్కొనే సత్తా ఉన్న రంగమిదే..!

21 May, 2020 16:29 IST|Sakshi

కోవిడ్ సంబంధిత అంతరాయాతో  విశ్లేషకులు పలు కంపెనీ షేర్ల వృద్ధి అంచనాలను, టార్గెట్‌ ధరలను తగ్గిస్తున్నారు. దీంతో ఇటీవల వారాల్లో అనేక షేర్లు రీ-రేటింగ్‌ను చూస్తున్నాయి. కానీ ఇంత సంక్షోభంలో ఒక రంగానికి చెందిన కంపెనీలు దుమ్ముదులుపుతున్నాయి. చాలామంది ఇన్వెస్టర్లు ఈ రంగంపై మక్కువ చూపిస్తున్నారు. అదే టెలికాం రంగం....

ఇటీవల కాలం వరకు ఈ రంగం నానా ఇబ్బందులతో సతమతమైతూ వచ్చింది. కానీ ఒక్కమారుగా ఈ రంగం బంగారుబాతుగా మారిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ వ్యవధిలో డబ్బులు డబుల్‌ కావడానికి టెలికాం రంగం ఉత్తమైన ఎంపికగా కొందరు మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   

లాక్‌డౌన్‌ సమయంలో డేటా, వాయిస్‌ వినియోగం పెరగడం, గతేడాది చివరి నెలలో టారీఫ్‌ల పెంపుతో పాటు భవిష్యత్తులో కంపెనీలు టారీఫ్‌లు పెంచవచ్చనే అంచనాలతో బ్రోకరేజ్‌ సంస్థలు టెలికాం రంగ షేర్లకు బుల్లిష్‌ రేటింగ్‌ను ఇస్తున్నాయి. రాబోయే కాలంలో ఈ కంపెనీల ఆదాయాలు పెరగవచ్చని అంచనా వేస్తున్నాయి.

 టెలికాం కంపెనీలు రానున్న పదేళ్ల వరకు వార్షిక ప్రాతిపాదికన 14శాతం చక్రీయ వార్షిక వృద్ది నమోదు చేయగలవని యాంబిట్‌ క్యాపిటల్ ఛైర్మన్‌ వివేకానంద్‌ అభిప్రాయపడ్డారు. ఈయన వోడాఫోన్‌ ఐడియా షేరుపై బాగా బుల్లిష్‌గా ఉన్నారు. త్వరలో పోస్ట్‌పెయిడ్‌ ధరలను పెంచడంతో పాటు ఇతర టెలికాం కంపెనీలతో పోలిస్తే  ప్రీమియం వినియోగదారులు అధికంగా ఉండటం వోడాఫోన్‌ ఐడియాకు కలిసొస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ కేటాయింపుతో పాటు,  ఏడాది కాలానికి టార్గెట్‌ ధరను రూ.19గా నిర్ణయించారు. ఈ టార్గెట్‌ ధర షేరు ప్రస్తుత ట్రేడింగ్‌ను నుంచి ఏకంగా 248శాతం అధికంగా ఉంది. ఇదే షేరు మార్చి కనిష్టం నుంచి ఏకంగా 73శాతం పెరిగింది.


టెలికాం రంగంలో ఆదాయాల విజిబిలిటి మెరుగుపడుతున్నందున టెలికాం షేర్లు రానున్న రోజుల్లో చెప్పుకోదగిన ర్యాలీ చేసే అవకాశం ఉందని నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ డిప్యూటీ సిఐఓ సైలేష్ రాజ్ భన్ అభిప్రాయపడ్డారు. భారతీ ఎయిర్‌టెల్‌ షేరుపై అధిక బ్రోకరేజ్‌ సంస్థలు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించాయి. మోర్గాన్‌ స్టాన్లీతో సహా మొత్తం 7 కంపెనీలు అవుట్‌పర్‌ఫామ్‌ రేటింగ్‌, 16 కంపెనీలు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించినట్లు రాయిటర్స్‌ నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల కంపెనీ నిరుత్సాహకరమైన త్రైమాసికపు ఫలితాలను ప్రకటించినప్పటికీ.., మోర్గాన్‌ స్టాన్లీ సేరు ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌ను కేటాయించడంతో పాటు షేరు టార్గెట్‌ ధరను రూ.525 నుంచి రూ.725కు పెంచింది. భారతీ ఎయిర్‌టెల్‌ షేరు ఈ క్యాలెండర్‌ అన్ని బ్లూచిప్‌ కంపెనీల్లో కెల్లా అత్యధిక ర్యాలీని చేసింది. వార్షిక ప్రాతిపదికన 31శాతం లాభపడింది. 

మరిన్ని వార్తలు