2015 డిసెంబర్‌కల్లా 9,600కు...

12 Nov, 2014 02:04 IST|Sakshi

ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు ఇకపై కూడా బుల్ పరుగు కొనసాగిస్తాయని స్విస్ బ్రోకరేజీ దిగ్గజం యూబీఎస్ తాజాగా అంచనా వేసింది. దీనిలో భాగంగా 2015 డిసెంబర్‌కల్లా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈ) ప్రధాన సూచీ నిఫ్టీ 9,600 పాయింట్లకు చేరుతుందని పేర్కొంది. ఇప్పటికే నిఫ్టీ 8,350 పాయింట్లనుదాటి కొత్త రికార్డులతో పరుగు తీస్తున్న నేపథ్యంలో యూబీఎస్ అంచనాలకు ప్రాధాన్యత ఏర్పడింది.

కంపెనీల ఫలితాలు, వృద్ధి గణాంకాలు ఇందుకు దోహదపడతాయని యూబీఎస్ పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటలోసాగుతున్నదని, దీంతో ప్రస్తుత మార్కెట్ విలువ కొనసాగుతుందని వివరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2015-16)లో 15%, ఆపై ఏడాది(2016-17) 18% చొప్పున కంపెనీల ఆర్జన వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. ద్ర వ్యోల్బణం మందగించడం, వడ్డీ రేట్ల తగ్గింపు, విధానాల మద్దతు వంటి  అంశాల కారణంగా 2017లో ఆర్థిక వ్యవస్థ 6.5% వృద్ధి సాధించే అవకాశముందని పేర్కొంది.

>
మరిన్ని వార్తలు