సీనియర్‌ సిటిజన్స్‌కు ..స్పెషల్‌ డిపాజిట్‌ స్కీమ్‌లు

23 May, 2020 13:40 IST|Sakshi

దేశంలోని వయో వృద్ధులకు మంచి లాభాన్ని చేకూర్చే ఫిక్స్‌డ్‌ డిజాజిట్‌ స్కీములను బ్యాంకులు అందిస్తున్నాయి.దీనిలో భాగంగా దేశీయ అతిపెద్ద బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌లు ఇటీవల సీనియర్‌ సిటిజన్స్‌ కోసం స్పెషల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌(ఎఫ్‌డీ) స్కీములను ప్రారంభించాయి. ప్రస్తుతం కోవిడ్‌-19 మహమ్మారీ కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో సీనియర్‌ సిటిజన్‌లను ఆదుకునేందుకు దేశంలో తొలిసారి వయోవృద్ధులకు ‘ఎస్‌బీఐ వి కేర్‌’ అనే ప్రత్యేకమైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమును ఎస్‌బీఐ ప్రవేశపెట్టింది. ‘హెచ్‌డీఎఫ్‌సీ సీనియర్‌ సిటిజన్‌ కేర్‌ ఎఫ్‌డీ’ పేరిట హెచ్‌డీఎఫ్‌ఎసీ స్కీమును ప్రారంభించగా, ఐసీఐసీఐ బ్యాంక్‌ సీనియర్‌ సిటిజన్స్‌ కోసం ప్రత్యేకంగా టర్మ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ ‘ఐసీఐసీఐ బ్యాంక్‌ గోల్డెన్‌ ఇయర్స్‌’ పేరిట అందిస్తోంది. 

ఎస్‌బీఐ ఎఫ్‌డీ స్కీమ్‌ ఫర్‌ సీనియర్‌ సిటిజన్స్‌
స్కీమ్‌ పేరు: ఎస్‌బీఐ వి కేర్‌. 2020 మే 12 నుంచి  ఈ స్కీమ్‌ కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. దీని కాలపరిమితి 5 ఏళ్లు. దీనిలో ఇన్వెస్ట్‌ చేసిన సీనియర్‌ సిటిజన్స్‌కు 80 బేసీస్‌ పాయింట్లు అధికంగా కొత్తగా వడ్డీని చెల్లిస్తారు. ఈ స్కీమ్‌లో ఎఫ్‌డీ చేసే సీనియర్‌ సిటిజన్‌లకు ఏడాదికి 6.5 శాతం వడ్డీ లభిస్తుంది. గడువు ముగియక ముందే ఎఫ్‌డీని ఉపసంహరించుకోవాలంటే అదనంగా వచ్చే 30 బేసిస్‌ పాయింట్ల ప్రీమియం రాదు. పైపెచ్చు 0.5 శాతం పెనాల్టీ విధిస్తారు. డిపాజిట్‌ మొత్తం రూ.2 కోట్లకు మించరాదు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ స్పెషల్‌ ఎఫ్‌డీ స్కీమ్‌ ఫర్‌ సీనియర్‌ సిటిజన్స్‌
స్కీమ్‌ పేరు: హెచ్‌డీఎప్‌సీ సీనియర్‌ సిటిజన్‌ కేర్‌. 2020 మే 18 నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది. 5 ఏళ్ల ఒక రోజు-10 ఏళ్ల వరకు ఈ స్కీముకు కాలపరిమితి ఉంటుంది. కొత్తగా ఇచ్చే వడ్డీ 75 బేసిస్‌ పాయింట్లు అధికంగా ఉంటుంది. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌ చేసిన సీనియర్‌ సిటిజన్‌కు ఏడాదికి వడ్డీ రేటు 6.50 శాతం లభిస్తుంది. దీంతోపాటు అదనంగా 25 బేసిస్‌ పాయింట్ల ప్రిమియం కూడా అదనం.గడువు ముగియక ముందే ఎఫ్‌డీని విత్‌డ్రా చేసుకోవాలంటే 1శాతం పెనాల్టీ చెల్లించాలి. ఒకవేళ 5 ఏళ్ల తర్వాత ఉపసంహరించుకోవాలంటే పెనాల్టీ 1.25 శాతం పడుతుంది. ఇక ఈ స్కీములో చేరాలనుకునేవారు రూ.5 కోట్ల వరకు ఎఫ్‌డీ చేయొచ్చు.

ఐసీఐసీఐ బ్యాంక్‌ స్పెషల్‌​ ఎఫ్‌డీ స్కీమ్‌ ఫర్‌ సీనియర్‌ సిటిజన్స్‌
స్కీమ్‌ పేరు: ఐసీఐసీఐ బ్యాంక్‌ గోల్డెన్‌ ఇయర్స్‌.2020 మే 20 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ స్కీముకు 5 ఏళ్ల ఒక రోజు-10 ఏళ్ల వరకు కాలపరిమితిని అందిస్తున్నారు.కొత్తగా 80 బేసిస్‌ పాయింట్లు అధికంగా వడ్డీని అందిస్తున్నారు. ఇక ఈ స్కీములో చేరిన సీనియర్‌ సిటిజన్స్‌కు ఏడాదికి 6.55 శాతం వడ్డీని చెల్లిస్తారు. 5ఏళ్ల ఒకరోజుకంటే ముందే ఎఫ్‌డీ విత్‌డ్రా చేయాలనుకుంటే 1 శాతం పెనాల్టీ కట్టాలి. 5 ఏళ్ల ఒకరోజు తరువాత ఎఫ్‌డీ తీసుకోవాలంటే 1.30 శాతం పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. ఈ స్కీములో చేరాలనుకునే సీనియర్‌ సిటిజన్‌లు రూ.2 కోట్లవరకు ఇన్వెస్ట్‌ చేయవచ్చు.

 ఈ మూడు స్కీముల్లో కామన్‌గా ఉన్నవి...

  • సీనియర్‌ సిటిజన్స్‌ స్పెషల్‌ ఎఫ్‌డీ స్కీము 5 ఏళ్ల కాలపరిమితి ఉండడం.
  • ఇప్పటికే ఎఫ్‌డీలు కలిగిన ఖాతాదారులతోపాటు, కొత్తగా స్పెషల్‌ ఎఫ్‌డీలను తీసుకున్న వారికి సైతం కొత్త వడ్డీరేట్లు వర్తిస్తాయి.
  • స్పెషల్‌ ఎఫ్‌డీ స్కీమ్‌లు 2020 సెప్టెంబర్‌ 30 వరకే అందుబాటులో ఉంటాయి.
  •  ఎస్‌బీఐ,హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌లు ఇప్పటికే ఎఫ్‌డీలు కలిగిన సీనియర్‌ సిటిజన్‌లకు అదనపు వడ్డీరేటును అందిస్తున్నాయి.
  •  దేశీయంగా నివసిస్తున్న60ఏళ్లు పైబడిన వారు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి అర్హులు.
Related Tweets
మరిన్ని వార్తలు