రెండు రోజుల నష్టాలకు బ్రేక్‌

27 Jun, 2020 05:51 IST|Sakshi

ఐటీ షేర్ల జోరు

329 పాయింట్ల లాభంతో 35,171కు సెన్సెక్స్‌ 

94 పాయింట్లు పెరిగి 10,383కు నిఫ్టీ  

వరుస రెండు రోజుల నష్టాల నుంచి శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ కోలుకుంది. ఐటీ, బ్యాంక్, ఇంధన షేర్ల జోరుకు సానుకూల అంతర్జాతీయ సంకేతాలు జత కావడం కలసివచ్చింది. సెన్సెక్స్‌ మళ్లీ 35,000 పాయింట్లు, నిఫ్టీ 10,300 పాయింట్లపైకి ఎగబాకాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఆరంభ లాభాలను కోల్పోయి ఫ్లాట్‌గా 75.65 వద్ద ముగిసినా, మన మార్కెట్‌ ముందుకే దూసుకుపోయింది.  సెన్సెక్స్‌ 329 పాయింట్లు ఎగసి 35,171 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 94 పాయింట్లు పెరిగి 10,383 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్‌ 440 పాయింట్లు, నిఫ్టీ 139 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. ఈ సూచీలు లాభపడటం ఇది వరుసగా నాలుగో వారం.  

మిశ్రమంగా ప్రపంచ మార్కెట్లు....
బ్యాంక్‌ల పెట్టుబడులపై ఉన్న పరిమితులను అమెరికా  తొలగించింది. దీంతో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్నా, ప్రపంచ మార్కెట్లు లాభాల్లోనే సాగుతున్నాయి. హాంగ్‌ కాంగ్‌ మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అయితే డివిడెండ్లపై పరిమితి విధించాలని, బైబ్యాక్‌లు ఆపేయాలని అమెరికా ప్రభుత్వం అక్కడి బ్యాంక్‌లను తాజాగా కోరింది. మాంద్యం పరిస్థితులు మరింత అస్తవ్యస్తమైన పక్షంలో నిధులను పరిరక్షించుకునే దిశగా  బ్యాంక్‌లను సిద్ధం చేయడాన్ని ఇది సూచిస్తోందని నిపుణులంటున్నారు. ఫలితంగా యూరప్‌ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. అమెరికా స్టాక్‌ సూచీలు 1–2% నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఐటీ షేర్లకు యాక్సెంచర్‌ జోష్‌
అంతర్జాతీయ ఐటీ దిగ్గజం యాక్సెంచర్‌ మార్చి క్వార్టర్‌ ఫలితాలు అంచనాలను మించాయి. దీంతో మన ఐటీ షేర్లు జోరుగా పెరిగాయి.  

► ఇన్ఫోసిస్‌ 7% లాభంతో రూ.వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.  
► దాదాపు 130కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. బయోకాన్, రుచి సోయా, ఆర్తి డ్రగ్స్‌ ఈ జాబితాలో ఉన్నాయి.

మరిన్ని వార్తలు