తాజాగా 178 పాయింట్లు అప్
3 రోజుల్లో 1106 పాయింట్లు జమ
56 పాయింట్ల లాభంతో 10,607కు నిఫ్టీ
ఐటీ, ఆటో, రియల్టీ రంగాలు భేష్
వరుసగా మూడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపడంతో సెన్సెక్స్ 178 పాయింట్లు లాభపడి 36,021 వద్ద నిలిచింది. వెరసి మూడు రోజుల్లో సెన్సెక్స్ 1,106 పాయింట్లను జమ చేసుకుంది. తద్వారా 36,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ఇక నిఫ్టీ సైతం 56 పాయింట్లు బలపడి 10,607 వద్ద ముగిసింది. కోవిడ్కు వ్యాక్సిన్లపై అంచనాలు, ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహం కలగలసి దేశీయంగా ఇన్వెస్టర్లకు జోష్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో రోజంతా మార్కెట్లు సానుకూలంగానే కదిలాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 36,110 వద్ద గరిష్టాన్ని తాకగా.. 35,872 వద్ద కనిష్టానికి చేరింది. ఈ బాటలో నిఫ్టీ 10,631-10,563 పాయింట్ల మధ్య ఊగిసలాడింది.
బ్యాంక్స్ వీక్
ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఐటీ, ఆటో, రియల్టీ రంగాలు 1 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. అయితే పీఎస్యూ బ్యాంక్స్ 1 శాతం, ప్రయివేట్ బ్యాంక్స్, మెటల్ 0.5 శాతం చొప్పున నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐషర్, అదానీ పోర్ట్స్, ఎయిర్టెల్, హీరో మోటో, ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, గ్రాసిమ్, ఇన్ఫ్రాటెల్, టాటా మోటార్స్, టీసీఎస్ 4.2-2 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్లో జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఇండస్ఇండ్, జీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సిప్లా, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో, ఐవోసీ, బజాజ్ ఫిన్సర్వ్ 2-0.6 శాతం మధ్య బలహీనపడ్డాయి.
భెల్, బెల్..
డెరివేటివ్స్లో బీఈఎల్, భారత్ ఫోర్జ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బీహెచ్ఈఎల్, సీమెన్స్, పెట్రోనెట్, అపోలో టైర్ 9.3-3.6 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. మదర్సన్ సుమీ, ఈక్విటాస్, ఎల్ఐసీ హౌసింగ్, ఆర్బీఎల్ బ్యాంక్, ఎల్అండ్టీ ఫైనాన్స్, బీవోబీ, బాష్, యూబీఎల్ 6-1.6 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1357 లాభపడగా.. 1378 నష్టపోయాయి.
ఎఫ్పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దాదాపు రూ. 557 కోట్ల అమ్మకాలు నిర్వహించగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 909 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. బుధవారం ఎఫ్పీఐలు రూ. 1696 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 1377 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.