దలాల్‌ స్ట్రీట్‌లో యుద్ధ మేఘాలు

6 Jan, 2020 14:54 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి.  అమెరికా-ఇరాన్‌ మధ్య భౌగోళిక ఉద్రిక్తతలు మరింత ముదరడంతో దలాల్‌ స్ట్రీట్‌కు పెద్ద దెబ్బ తగిలింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఆరంభంనుంచి కుదేలైన కీలక సూచీలు  ఆ తరువాత ఏమాత్రం కోలుకోలేదు. మిడ్ సెషన్‌ తరువాత మరింత నీరసపడ్డాయి. ప్రస్తుతం  సెన్సెక్స్‌ 800 పాయింట్లకు పైగా, నిఫ్టీ 240 పాయింట్లకు మించి కుదేలయ్యాయి. దీంతో సెన్సెక్స్‌ 41వేలు, నిఫ్టీ 12వేల కీలక మద్దతు స్థాయిలను  కోల్పోయాయి.

దాదాపు అన్ని రంగాల షేర్లలో అమ్మకాల వెల్లువకొనసాగుతోంది. నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌  నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ క్షీణించాయి. ముఖ‍్యంగా బ్యాంకింగ్‌, ఆటో, మెటల్‌ రంగ షేర్లు భారీగా పతమవుతున్నాయి.  మరోవైపు బంగారం ధరలు పుంజుకోవడంతో టైటన్‌ లాంటి జ్యువెల్లరీ షేర్లు పాజిటివ్‌గా ఉన్నాయి. రూపాయి బలహీనత నేపథ్యంలో ఐటీరంగంలో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ షేర్లపై   ట్రేడర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. అటు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 9నెలల గరిష్టానికి చేరుకోవడంతో దేశీయ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 72స్థాయికి  పడిపోయింది. 28 పైసలు నష్టపోయి 72.08 వద్ద చేరుకుంది.

మరిన్ని వార్తలు