బ్లడ్‌ బాత్‌ : మూడేళ్ల కనిష్టానికి నిఫ్టీ

18 Mar, 2020 15:25 IST|Sakshi

సాక్షి, ముంబై: దలాల్‌ స్ట్రీట్‌లో కరోనా ప్రభావంతో బ్లడ్‌బాత్‌ కొనసాగుతోంది. వరుస నష్టాలతో దేశీయ స్టాక్‌మార్కెట్లు ప్రధాన మద్దతు స్థాయిలను కోల్పోతూ పాతాళానికి పడిపోతున్నాయి.  ఈ క్రమంలో బుధవారం కూడా మరోసారి భారీగా కుదేలయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో  ఆరంభం నుంచే బలహీనంగా ఉన్న సూచీలు మిడ్‌  సెషన్‌ నుంచి మరింత నష్టాల్లోకి జారు కున్నాయి. సెన్సెక్స్‌1451 పాయింట్లు, నిఫ్టీ 430 పాయింట్లకు పైగా  కుప్పకూలింది. దాదాపు అన్ని రంగాల షేర్లు అమ‍్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. చివరలో పుంజుకుని సెన్సెక్స్‌  1710 పాయింట్లు క్షీణించగా.  నిఫ్టీ 498 పాయింట్ల నష్టంతో ముగిసింది.  తద్వారా సెన్సెక్స్‌   30 వేలు, చివరికి 29 వేల పాయింట్ల స్థాయిని కోల్పోయింది.  నిఫ్టీ 8500 పాయింట్ల దిగువన నిఫ్టీ మూడేళ్ల కనిష్ట స్థాయికి చేరుకుంది.  బ్యాంకింగ్‌ రంగ నష్టాలతో నిఫ్టీ బ్యాంకు 2017 తరువాత తొలిసారి 21 వేల స్థాయికి క్షీణించింది.  అయితే  ఆర్‌బీఐ బాండ్ల కొనుగోలు  ప్రకటనతో ఆఖరి పది  నిమిషాల్లో ఊహించని విధంగా కీలక సూచీలు కోలుకోవడం గమనార‍్హం.

హెచ్‌డిఎఫ్‌సి ట్విన్స్‌, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్  (నాలుగేళ్ల కనిష్టం)  టాటా మోటార్స్‌ 11 ఏళ్ల కనిష్టం, ఐసీఐసీఐ బ్యాంక్ ,  సింధు ఇండ్ బ్యాంక్, వోడాఫోన్‌ ఐడియా, బంధన​ బ్యాంకు  సెన్సెక్స్‌లో భారీగా నష్టపోయాయి. భారతి ఇన్‌ఫ్రాటెల్, బజాజ్ ఫైనాన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్‌సర్వ్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, హీరో మోటోకార్ప్, భారత్ పెట్రోలియం కూడా 6-17 శాతం క్షీణించాయి. మరోవైపు జీ ఎంటర్‌ టైన్‌మెంట్, ఐటీసీ,ఎన్‌ఎండీసీ, ఓఎన్‌జీసీ, యస్‌బ్యాంకు, టీసీఎస్‌ లాభపడ్డాయి. 

మరిన్ని వార్తలు