నేడే ఫెడ్‌ నిర్ణయం : లాభాల్లో మార్కెట్లు

21 Mar, 2018 15:54 IST|Sakshi
స్టాక్‌ మార్కెట్లు (ఫైల్‌ ఫోటో)

ముంబై : ఫెడ్‌ సమావేశ ఫలితాలు, సెకండ్‌ హాఫ్‌ సెషన్‌లో చోటు చేసుకున్న ప్రాఫిట్‌ బుకింగ్‌తో దేశీయ స్టాక్‌ మార్కెట్లు చివరికి కాస్త లాభాలను తగ్గించుకున్నాయి. నేటి ఇంట్రాడేలో దాదాపు 300 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్‌, చివరికి 139 పాయింట్ల లాభంలో 33,136 వద్ద ముగిసింది. నిఫ్టీ 30 పాయింట్ల లాభంలో 10,155 వద్ద క్లోజైంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో మార్కెట్లు ఆద్యంతం సానుకూలంగానే ట్రేడయ్యాయి. కానీ చివరకు ఇన్వెస్టర్లు కాస్త ప్రాఫిట్‌ బుకింగ్‌కు పాల్పడ్డారు.   

రెండు రోజులపాటు సమావేశమైన అమెరికా ఫెడ్‌ పాలసీ నిర్ణయం నేటి అర్ధరాత్రి వెలువడనుంది. కొత్త చైర్మన్‌ పావెల్‌ అధ్యక్షతన ఫెడ్ కమిటీ కనీసం పావు శాతం వడ్డీ రేటును పెంచే అవకాశముందని తెలుస్తోంది. దీంతో ఫెడ్‌ ఫండ్స్‌ రేటు 1.5-1.75 శాతానికి చేరనున్నట్లు అత్యధికులు భావిస్తున్నారు. ఇన్వెస్టర్లు ఫెడ్‌ నిర్ణయాలపై ఎక్కువగా దృష్టి సారించినట్టు నిపుణులు పేర్కొన్నారు.

ఫార్మా, మెటల్‌, మీడియా షేర్లు నష్టాలు గడించగా.. రియల్టీ 0.8 శాతం పైకి ఎగసింది. బ్లూచిప్స్‌లో ఎయిర్‌టెల్‌ 4.3 శాతం జంప్‌చేయగా.. బజాజ్‌ ఫైనాన్స్‌, ఎన్‌టీపీసీ, ఐబీ హౌసింగ్‌, బీపీసీఎల్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, అల్ట్రాటెక్, ఓఎన్‌జీసీ, ఇండస్‌ఇండ్ 2.5-1 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే టాటా స్టీల్‌, హీరోమోటో, ఐషర్‌, అదానీ పోర్ట్స్‌, ఇన్‌ఫ్రాటెల్‌, అరబిందో, బజాజ్‌ ఆటో, టాటా మోటార్స్‌, టెక్‌ మహీంద్రా 2-1 శాతం మధ్య బలహీనపడ్డాయి.
 

మరిన్ని వార్తలు