ముంబై : రెండు రోజుల యూఎస్ ఫెడరల్ రిజర్వు మీటింగ్ ప్రారంభం కాబోతున్న తరుణంలో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. దీంతో ఐదు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 74 పాయింట్లు పెరిగి 32,997 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 30 పాయింట్ల లాభంలో 10,124 వద్ద క్లోజైంది. గత మూడు సెషన్ల నుంచి నష్టాలు పాలవుతూ వచ్చిన ఐటీ స్టాక్స్ ఈ రోజు లాభాల బాట పట్టాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.5 శాతం పెరిగింది. విప్రో షేర్లు 1.7 శాతం, ఇన్ఫోసిస్ షేర్లు 1.6 శాతం, హెచ్సీఎల్ టెక్ 1.2 శాతం, టీసీఎస్ 1.2 శాతం లాభాలనార్జించాయి.
అయితే నేడు ప్రారంభం కాబోతున్న ఫెడరల్ రిజర్వు పాలసీపై ఇన్వెస్టర్లు ఎక్కువగా దృష్టిసారించినట్టు మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. వచ్చే రెండు రోజులు మార్కెట్లు ఒత్తిడిలో కొనసాగవచ్చని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఓఎన్జీసీ, యస్ బ్యాంకు, బీపీసీఎల్, ఆల్ట్రాటెక్ సిమెంట్ 1.5 శాతం కిందకి పడిపోయింది.