ముంబై : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ భేటీ సక్సెస్ అయిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లకు మంచి బూస్ట్ అందింది. స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు, చివరికి భారీ లాభాలనే ఆర్జించాయి. సెన్సెక్స్ డబుల్ సెంచరీని అధిగమించి, 209 పాయింట్ల లాభంలో 35693 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 10,850 మార్కుకు చేరువలో 55 పాయింట్ల లాభంలో 10,843 వద్ద స్థిరపడింది. ముందు రోజుకి విరుద్ధమైన రీతిలో చివరిలోనూ మార్కెట్లు లాభాల వర్షం కురిపించాయి.
ఇన్వెస్టర్లు చివరి వరకు కొనుగోళ్లనే చేపట్టారు. ఫార్మా, బ్యాంకింగ్ షేర్ల మద్దతుతో మార్కెట్లు ఈ మేర లాభాలను ఆర్జించాయి. ఎస్బీఐ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, లుపిన్, హెచ్డీఎఫ్సీ నేటి ట్రేడింగ్లో మంచి లాభాలను ఆర్జించాయి. అయితే నేడు మెటల్, రియాల్టీ స్టాక్స్ ఎక్కువగా నష్టపోయాయి. టాటా స్టీల్, పవర్ గ్రిడ్, గ్రాసిమ్లు టాప్ లూజర్లుగా నష్టాలు గడించాయి. అటు డాలర్తో రూపాయి మారకం విలువ 4 పైసల లాభంలో 67.39గా ఉంది.