పాతాళంలోకి రూపాయి : కుదేలైన స్టాక్‌ మార్కెట్లు

10 Sep, 2018 16:44 IST|Sakshi

ముంబై : రూపాయి పాతాళంలోకి దిగజారడం... స్థూల ఆర్థిక అంశాలు మార్కెట్లను ఓ కుదుపు కుదిపేశాయి. మార్కెట్‌ ప్రారంభమైనప్పటి నుంచి ప్రారంభమైన అమ్మకాల ఒత్తిడి... చివరి వరకు కొనసాగుతూనే ఉంది. దీనికి తోడు ఇంట్రాడేలో రూపాయి మరింత దిగజారడం మార్కెట్లను భారీగా దెబ్బకొట్టింది. సెన్సెక్స్‌ 450 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 11,450 మార్కును కోల్పోయింది. మధ్యాహ్నం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌, నిఫ్టీ 1 శాతానికి పైగా నష్టపోయాయి. చివరి వరకు ఈ నష్టాలను మరింత పెంచుకుంటూనే పోతూ.. సెన్సెక్స్‌ 468 పాయింట్ల నష్టంలో 37,922 వద్ద, నిఫ్టీ 151 పాయింట్ల నష్టంలో 11,438 వద్ద స్థిరపడ్డాయి. మార్చి 16, ఫిబ్రవరి 6 తర్వాత సెన్సెక్స్‌​, నిఫ్టీ అత్యధికంగా నష్టపోయింది నేడే. 

ఆటో, బ్యాంకింగ్‌ స్టాక్స్‌ టాప్‌ లూజర్లుగా నష్టాలు గడించాయి. బీఎస్‌ఈ ఆటో ఇండెక్స్‌ 248 పాయింట్లు, బీఎస్‌ఈ బ్యాంకింగ్‌ ఇండెక్స్‌ 241 పాయింట్లు పడిపోయాయి. దాదాపు అన్ని రంగాల స్టాక్స్‌లోనూ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌, ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, ఫార్మాలు 1-2 శాతం చొప్పున నష్టపో​యాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండియాబుల్స్‌ హౌజింగ్‌ ఫైనాన్స్‌, సన్‌ ఫార్మా, బీపీసీఎల్‌, మహింద్రా, వేదంతలు 3.5 శాతం కిందకి పడిపోయాయి. 

డాలర్‌తో రూపాయి మారకం విలువ భారీగా క్షీణించడం, అమెరికా-చైనాల మధ్య మరోసారి ట్రేడ్‌ వార్‌ విజృంభించడం మార్కెట్లను భారీగా దెబ్బకొట్టింది. గ్లోబల్‌గా వస్తున్న బలహీనమైన సంకేతాలు, వాణిజ్య లోటు, రూపాయి క్షీణత, అమ్మకాల ఒత్తిడి ఇవన్నీ మార్కెట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపినట్టు రెలిగేర్‌ బ్రోకింగ్‌ ప్రెసిడెంట్‌ జయంత్‌ మంగ్లిక్‌ చెప్పారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణత ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. నేటి ట్రేడింగ్‌లో కూడా అత్యంత కనిష్ట స్థాయిలను నమోదు చేస్తూ... అంతకంతకు క్షీణిస్తూ వచ్చింది. ఒ‍కానొక దశలో రూపాయి ఏకంగా 91 పైసల క్షీణతను నమోదు చేసింది. ప్రస్తుతం 67 పైసల నష్టంలో 72.40 వద్ద ఉంది.

మరిన్ని వార్తలు