రికార్డుల జోరుతో పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ చివరికి స్వల్పనష్టాల్లో ముగిశాయి. బుధవారం ట్రేడింగ్ లో సెన్సెక్స్ 13.60 పాయింట్ల నష్టంలో 31,145 వద్ద, నిఫ్టీ 3.30 పాయింట్ల నష్టంలో 9,621 వద్ద క్లోజయ్యాయి. మహింద్రా అండ్ మహింద్రా, లుపిన్, ఆల్ట్రాటెక్ సిమెంట్ రెండు సూచీల్లో లాభాల్లో పైకి ఎగియగా.. టాటా స్టీల్, ఇన్ఫోసిస్, వేదంత, భారతి ఇన్ ఫ్రాటెల్ ఎక్కువగా నష్టపోయాయి. క్యూ4 స్థూల దేశీయోత్పత్తి డేటాను ప్రభుత్వం నేడే ప్రకటించనుంది.
ఈ నేపథ్యంలో మధ్యాహ్న ట్రేడింగ్ వరకు రికార్డు స్థాయిలను నమోదుచేసిన మార్కెట్ లో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడం ప్రారంభించారు. జీడీపీ డేటాతో పాటు ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు పాల్పడటంతో మార్కెట్లు కిందకి పడిపోయాయి. సెన్సెక్స్ గరిష్టంగా 31,216.98ని, నిఫ్టీ 9636.55 స్థాయిలను తాకింది. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 15 పైసలు బలపడి 64.52 వద్ద నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు కూడా స్వల్పంగా 25 రూపాయల నష్టపోయి 28,716గా ఉన్నాయి.