రెండు నెలల గరిష్టానికి సూచీలు
35 పాయింట్ల లాభంతో 34,451కు సెన్సెక్స్
21 పాయింట్లు పెరిగి 10,585కు నిఫ్టీ
స్టాక్మార్కెట్ సోమవారం స్వల్ప లాభాలతో సరిపెట్టుకుంది. ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్లో వినియోగ షేర్ల కౌంటర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 35 పాయింట్లు పెరిగి 34,451 పాయింట్ల వద్ద, నిఫ్టీ 21 పాయింట్ల లాభంతో 10,585 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు రెండు నెలల గరిష్ట స్థాయికి పెరిగాయి.
404 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్...
అమెరికా–చైనా వాణిజ్య సంబంధాలపై ఆందోళన, అంతర్జాతీయ ముడి చమురు ధరల గమనంపై అనిశ్చితిల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు నష్టపోవడం, డాలర్తో రూపాయి మారకం బలహీనపడడం వంటి కారణాల వల్ల ట్రేడింగ్ మొత్తం ఒడిదుడుకులమయంగా సాగింది. ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. సెన్సెక్స్ 34,494 పాయింట్ల వద్ద లాభాల్లో ఆరంభమైంది.
ఆసియా మార్కెట్ల బలహీనత కారణంగా మన మార్కెట్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో ఇంట్రాడేలో 156 పాయింట్ల నష్టంతో 34,259 పాయింట్ల వద్ద కనిష్ట స్థాయిని తాకింది. టీసీఎస్ షేర్లలో భారీగా కొనుగోళ్లు జరగడంతో మళ్లీ లాభాల్లోకి వచ్చింది. ఇంట్రాడేలో 248 పాయింట్ల లాభంతో 34,664 పాయింట్ల వద్ద గరిష్ట స్థాయిని తాకింది. మొత్తం మీద రోజంతా 404 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 49 పాయింట్లు నష్టపోయింది. మరో దశలో 74 పాయింట్లు లాభపడింది.
లెమన్ ట్రీ....జోరు..: ఇటీవలే స్టాక్మార్కెట్లో లిస్టయిన లెమన్ ట్రీ హోటల్స్ కంపెనీ ఇంట్రాడేలో 8 శాతం ఎగసి రూ.91ను తాకింది. చివరకు 0.8 శాతం లాభంతో రూ.84.5 వద్ద ముగిసింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంతో మూడు ఒప్పందాలు కుదుర్చుకున్నామని ఈ కంపెనీ వెల్లడించడంతో గత రెండు ట్రేడింగ్ సెషన్లలో ఈ షేర్ 17 శాతం వరకూ లాభపడింది. ఇష్యూ ధర, రూ. 56 తో పోల్చితే ఈ షేర్ 52 శాతం ఎగసింది.
ఆల్టైమ్ హైకి ఇండస్ఇండ్ బ్యాంక్
ఇండస్ఇండ్ బ్యాంక్ ఇంట్రాడేలో ఆల్టైమ్ హై..రూ.1,885ను తాకింది. చివరకు 3.6 శాతం లాభంతో రూ.1,875ను తాకింది. సెన్సెక్స్లో బాగా పెరిగిన షేర్ ఇదే. మహీంద్రా అండ్ మహీంద్రా 2.7 శాతం, సన్ ఫార్మా 1.7 శాతం, యస్ బ్యాంక్ 1.4 శాతం, అదానీ పోర్ట్స్ 1 శాతం, కోటక్ బ్యాంక్ 1 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.7 శాతం, భారతీ ఎయిర్టెల్ 0.7 శాతం, ఎస్బీఐ 0.5 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 0.4 శాతం, ఇన్ఫోసిస్ 0.4 శాతం, మారుతీ సుజుకీ 0.2 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.1 శాతం చొప్పున పెరిగాయి.
ఇక నష్టపోయిన షేర్ల విషయానికొస్తే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.4 శాతం, కోల్ ఇండియా 1 శాతం, హీరో మోటొకార్ప్ 0.9 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.8 శాతం, టాటా మోటార్స్0.8 శాతం, ఓఎన్జీసీ 0.8 శాతం, హిందుస్తాన్ యూనిలివర్ 0.7 శాతం, విప్రో 0.5 శాతం, ఎన్టీపీసీ 0.4 శాతం చొప్పున నష్టపోయాయి.