రికార్డు్ల వారం...

21 Dec, 2019 06:09 IST|Sakshi

నాలుగు రోజులు ఆల్‌టైమ్‌హైలు 

ఇంట్రాడేలో, ముగింపులో కొనసాగిన రికార్డులు  

8 పాయింట్ల లాభంతో 41,682కు సెన్సెక్స్‌

12 పాయింట్లు పెరిగి 12,272కు నిఫ్టీ  

స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం స్వల్ప లాభాలతో గట్టెక్కింది. చివర్లో అమ్మకాలు జోరుగా సాగడంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. అయినప్పటికీ.. సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా నాలుగో రోజూ ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్‌లను సృష్టించాయి. వృద్ధి అంచనాలను ఫిచ్‌ రేటింగ్స్‌ తగ్గించడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గడం ఒక దశలో ప్రతికూల ప్రభావం చూపించాయి.  సెన్సెక్స్‌ 8 పాయింట్ల లాభంతో 41,682 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12 పాయింట్లు పెరిగి 12,272 వద్ద ముగిశాయి.

ఇక వారం పరంగా చూస్తే, ఆల్‌టైమ్‌ హై రికార్డ్‌లు హోరెత్తిపోయాయి. మొత్తం 5 ట్రేడింగ్‌ రోజుల్లో   4 రోజులు సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త శిఖరాలకు ఎగబాకాయి. ఈ వారంలో సెన్సెక్స్‌ 672 పాయింట్లు, నిఫ్టీ 185 పాయింట్ల మేర పెరిగాయి. బడ్జెట్‌లో మరిన్ని ఉద్దీపన చర్యలు ఉంటాయన్న అంచనాలతో ఆరంభంలో కొనుగోళ్లు జోరుగా సాగాయి. లిక్విడిటీ కొరతను పూడ్చటానికి ఆర్‌బీఐ ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా రూ.10,000 కోట్ల బాండ్ల క్రయ, విక్రయాలను నిర్వహించడం, ట్రెజరీ లాభాలు పెరుగుతాయనే అంచనాలతో ప్రభుత్వ రంగ షేర్లు పెరగడం, క్రిస్మిస్‌ సెలవులకు ముందు ప్రపంచ మార్కెట్లు ‘బుల్లిష్‌ మూడ్‌’లో ఉండటం  సానుకూల ప్రభావం చూపించింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, యూరప్‌ మార్కెట్లు లాభపడ్డాయి.  


2.2 రెట్లు సబ్‌స్క్రైబయిన ప్రిన్స్‌ పైప్స్‌ ఐపీఓ
ప్రిన్స్‌ పైప్స్‌ అండ్‌ ఫిట్టింగ్స్‌ కంపెనీ ఐపీఓ 2.2 రెట్లు సబ్‌స్క్రైబయింది. శుక్రవారం ముగిసిన ఈ ఐపీఓ ప్రైస్‌బాండ్‌ రూ.177–178గా ఉంది. ఈ నెల 31న ఈ కంపెనీ షేర్లు స్టాక్‌ మార్కెట్లో లిస్టవుతాయి.

మరిన్ని వార్తలు