10300 వద్ద నిఫ్టీ ప్రారంభం
పరుగులు పెడుతున్న ఫార్మా షేర్లు
నష్టాల్లో ఐటీ షేర్లు
దేశీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న స్టాక్ సూచీలు సోమవారం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ పాయింట్ల 152 లాభంతో 34884 వద్ద, నిఫ్టీ 56 పాయింట్లు పెరిగి 10300 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. ఆరంభంలో భారీగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఉదయం గం.9:20ని.లకు సెన్సెక్స్ 300 పాయింట్లు పెరిగి 35033 వద్ద, నిఫ్టీ 92 పాయింట్ల లాభంతో 10337.05 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఒక్క ఐటీ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన సూచీలకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. అత్యధికంగా ఫార్మా షేర్లు లాభపడుతున్నాయి. బ్యాంకింగ్ రంగ షేర్లకు లభించిన కొనుగోళ్లతో బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 1శాతం లాభంతో 21556 వద్ద ట్రేడ్ అవుతోంది.
కోవిడ్-19 వైరస్ వ్యాధిని అరికట్టేందుకు గ్లెన్మార్క్ సిప్లా, హెటిరో ఫార్మా సంస్థలు తయారు చేసిన ఔషధానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) అనుమతి లభించడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లో సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. ధనలక్ష్మీ బ్యాంక్, జీటీఎల్, కిర్లోస్కర్ ఇండస్ట్రీస్, ఇన్ఫో ఎడ్జ్, ఎన్డీటీవీ, ఆన్మొబైల్ గ్లోబల్ కంపెనీలతో సహా 61కంపెనీలు నేడు తమ ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ సంకేతాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఆసియాలో హాంకాంగ్, కొరియా స్వల్పంగా నష్టపోగా.. సింగపూర్, తైవాన్, చైనా 0.5 శాతం చొప్పున బలపడ్డాయి. జపాన్, ఇండొనేసియా మార్కెట్లు స్వల్ప ట్రేడ్ అవుతున్నాయి. గతవారం ట్రేడింగ్ చివరి రోజైన శుక్రవారం అమెరికా సూచీలైన డోజోన్స్, ఎస్అండ్పీ నష్టాలతో ముగియగా.. నాస్డాక్ ఇండెక్స్ మాత్రం స్వల్ప నష్టాలతో ముగిసిన సంగతి తెలిసిందే.
బజాజ్ అటో, ఇండస్ఇండ్, బజాజ్ ఫైనాన్స్, సిప్లా, బజాజ్ ఫిన్ సర్వీసెస్ షేర్లు 2.50శాతం నుంచి 5.50శాతం లాభపడ్డాయి. హిందాల్కో, టీసీఎస్, ఎంఅండ్ఎం, టాటామోటర్స్, విప్రో షేర్లు అరశాతం నుంచి 2.50శాతం నష్టాన్ని చవిచూశాయి.