10500పైన నిఫ్టీ ప్రారంభం

2 Jul, 2020 09:34 IST|Sakshi

280 పాయింట్లు లాభంతో మొదలైన సెన్సెక్స్‌

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు 

బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ ఈక్విటీ మార్కెట్‌ గురువారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 280 పాయింట్లు లాభంతో 35693వద్ద, నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 10515 ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సూచీలకిది వరుసగా రెండోరోజూ లాభాల ప్రారంభం కావడం విశేషం. అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. అత్యధికంగా ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దుతు లభిస్తోంది. బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1శాతానికి పైగా లాభపడి 22వేలపైన 22222 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

 అంతర్జాతీయ మార్కెట్లను పరిశీలిస్తే..., కోవిడ్‌ కేసులు పెరుగుతుండటం, మరోవైపు కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ తయారీలో పురోగతి వంటి అంశాల నేపథ్యంలో బుధవారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఆ దేశ బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ల్లో డోజోన్స్‌ స్వల్ప నష్టాల్లో ముగిసింది. ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ అరశాతం నుంచి 1శాతం లాభం‍తో ముగిశాయి. నేడు మన మార్కెట్‌ ప్రారంభ సమయానికి ఆసియాలో మార్కెట్లన్నీ సానుకూలంగా కదులుతున్నాయి. 

నిఫ్టీ ఇండెక్స్‌లో... గెయిల్‌, ఇండస్‌ ఇండ్‌, ఓఎన్‌జీసీ, టైటాన్‌, ఎంఅడ్‌ఎం షేర్లు 1.50శాతం నుంచి 3శాతం లాభపడ్డాయి. మరోవైపు కోల్‌ ఇండియా, ఐషర్‌మోటర్స్‌, టెక్‌ మహీంద్రా, యూపీఎల్‌ షేర్లు 0.10శాతం నుంచి అరశాతం నష్టాన్ని చవిచూశాయి.

మరిన్ని వార్తలు