సాక్షి,ముంబై: దేశీయ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణతో గరిష్టం నుంచి మార్కెట్ 300 పాయింట్లు కుప్పకూలింది. మిడ్ సెషన్నుచి లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న సెన్సెక్స్ ప్రస్తుతం 122 పాయింట్ల నష్టంతో 40766 వద్ద, నిఫ్టీ 50 పాయింట్లు బలహీనపడి 12025 వద్ద కొనసాగుతున్నాయి. టెలికం రంగానికి ఇవ్వాల్సిన ఉపశమన చర్యలను సిఫార్సు చేసేందుకు ఏర్పాటైన కార్యదర్శుల కమిటీ కధ ముగిసిందని ప్రభుత్వాధికారి చెప్పడంతో టెల్కోల ఆశలు ఆవిరైపోయాయి. మరోవైపు ట్రేడర్లు అమ్మకాలు వెల్లువెత్తాయి. అటు జీ ఎంటర్టైన్ మెంట్ ఛైర్మన్ సుభాష్ చంద్ర రాజీనామాతో జీ షేర్లు కుప్పకూలాయి. దీంతో పాటు భారతి ఇన్ఫ్రాటెల్, ఎయిర్టెల్, గ్రాసిం, జెఎస్ డబ్ల్యూ స్టీల్, సన్ఫార్మా, బీపీసీఎల్ నష్టపోతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు, యస్ బ్యాంకు, ఇండస్ ఇండ్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్, ఐటీసీ, టాటా స్టీల్ లాభపడుతున్నాయి.