ముంబై : రికార్డు స్థాయిల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు కాస్త వెనక్కి తగ్గాయి. ఆగస్టు నెల ప్రారంభంలో ఫ్లాట్గా ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 74 పాయింట్ల లాభంలో 37,680 వద్ద, నిఫ్టీ 31 పాయింట్ల లాభంలో 11,387 వద్ద ట్రేడవుతున్నాయి. సానుకూల ప్రపంచ సంకేతాలు, ఆర్బీఐ పాలసీ నేపథ్యంలో మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకింది. నిఫ్టీ సైతం 11,350 పైకి ఎగిసింది. ప్రస్తుతం సైతం 11,350 పైననే ట్రేడవుతోంది.
ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను నేడు వెల్లడించనుంది. ఈ క్రమంలో ఆర్బీఐ పాలసీపై దృష్టిపెట్టిన మదుపర్లు అప్రమత్తత వ్యవహరిస్తున్నారని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. దీంతో స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నట్టు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో టాటామోటార్స్ షేర్లు నేడు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రెండు సూచీల్లోనూ షేరు ధర దాదాపు 3శాతం వరకు నష్టంతో కొనసాగుతోంది. ఐషర్ మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, హిందాల్కో, ఎన్టీపీసీ షేర్లు కూడా నష్టాల్లో ఉండగా.. ఎయిర్టెల్, భారత్ పెట్రోలియం, బజాజ్ ఆటో, లుపిన్, హిందుస్థాన్ పెట్రోలియం షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అటు డాలర్తో రూపాయి మారకం విలువ రూ. 68.54 వద్ద కొనసాగుతోంది.