సాక్షి, ముంబై : కొనుగోళ్ల జోరుతో దేశీయ స్టాక్ మార్కెట్లు ధూం ధాం మనిపించాయి. లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు, కొనుగోళ్ల జోరుతో మిడ్సెషన్ నుంచి మరింత ఊపందుకున్నాయి. చివర్లో ఇన్వెస్టర్లు మరింత కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఒకానొక దశలో సెన్సెక్స్ 395 పాయింట్ల మేర ఎగిసింది. ఇక చివరికి త్రిపుల్ సెంచరీకి పైననే 318 పాయింట్ల లాభంలో 34,663 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే 83 పాయింట్ల లాభంతో 10,514 వద్ద స్థిరపడింది. ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా షేర్ల జోరుతో మార్కెట్లు ఈ మేర ఎగిసినట్టు మార్కెట్ విశ్లేషకులు చెప్పారు.
ఐటీ, బ్యాంకింగ్, ఫార్మాలు లాభాలు పండిస్తే.. ఆటో రంగం మాత్రం కాస్త నిరాశపరిచింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంకు, భారతీ ఎయిర్టెల్ 4 శాతం వరకు లాభాలు పండించగా.. టాటా మోటార్స్, గెయిల్, ఓఎన్జీసీ 4 శాతం నుంచి 7 శాతం వరకు నష్టపోయాయి. నిఫ్టీ మిడ్క్యాప్ మాత్రం 70 పాయింట్లు క్షీణించింది. ఆర్ఈసీ, జుబిలెంట్ ఫుడ్వర్క్స్, పరాగ్ మిల్క్స్ ఫుడ్స్, హెక్సావేర్, కేపీఐటీ టెక్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్లు 5 శాతం వరకు లాభపడగా.. యూనిడెట్ స్పిరిట్స్, జెట్ ఎయిర్వేస్, మదర్సన్ సుమి 6 శాతం వరకు కిందకి పడిపోయాయి.