ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా కుదేలయ్యాయి. ఒక్కసారిగా 500 పాయింట్లకు పైగా సెన్సెక్స్ ఢమాలమంది. నిఫ్టీ సైతం 11,300 మార్కు కిందకి పడిపోయింది. గత ఆరు నెలల కాలంలో ఇదే అతిపెద్ద నష్టం. మధ్యాహ్న సెషన్లో నెలకొన్న మరింత అమ్మకాల ఒత్తిడి, మార్కెట్లకు కుప్పకూల్చింది. అంతకంతకు పెరుగుతున్న క్రూడాయిల్ ధరలు, ట్రాడే వార్ ఆందోళనలు, రూపాయి విలువ భారీగా క్షీణించడం, నేడు కూడా చరిత్రాత్మక కనిష్ట స్థాయిల్లోకి రూపాయి కూరుకుపోవడం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి.
మరోవైపు బ్యాంక్లు, ఆటోమొబైల్స్, ఎఫ్ఎంసీజీ, మెటల్స్, ఫార్మాస్యూటికల్స్, ఐటీ ఇలా అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాల తాకిడే కనిపించింది. దీంతో నిఫ్టీ మిడ్క్యాప్ ఇండెక్స్ సైతం ఒక శాతానికి పైగా పడిపోయింది. ట్రేడింగ్ ముగింపు నాటికి సెన్సెక్స్ 509 పాయింట్లు పతనమై, 37,413.13 వద్ద, నిఫ్టీ 151 పాయింట్లు క్షీణించి 11,300 మార్కు దిగువన 11,287.5 వద్ద క్లోజయ్యాయి. కోల్ ఇండియా, ఎం అండ్ ఎంలు మాత్రమే టాప్ గెయినర్లుగా ఉండగా.. టాటా స్టీల్, పవర్ గ్రిడ్, టైటాన్లు టాప్ లూజర్లుగా ఎక్కువగా నష్టాలు గడించాయి. మరోవైపు డాలర్తో రూపాయి మారకం విలువ ఆల్-టైమ్ కనిష్ట స్థాయిల్లోకి పతనమైంది. 72.74 వద్ద అత్యంత కనిష్ట స్థాయిలను నమోదు చేసింది. గత ఆరు నెలల్లో అత్యధికంగా నష్టపోయింది నేడేనని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు.