భారత కంపెనీలపై ప్రపంచ బ్యాంక్‌ వేటు

4 Oct, 2018 20:15 IST|Sakshi
ప్రపంచ బ్యాంక్‌ ఫైల్‌ ఫోటో

వాషింగ్టన్‌ : పలు భారతీయ కంపెనీలు, పౌరులపై ప్రపంచ బ్యాంక్ వేటు వేసింది. ప్రపంచవ్యాప్తంగా చేపడుతున్న పలు ప్రాజెక్ట్‌లను ఆయా కంపెనీలు చేపట్టకుండా నిషేధం విధించింది. అవినీతి, మోసాలకు పాల్పడుతున్నందుకు గాను, మొత్తం 78 భారతీయ కంపెనీలపై నిషేధం విధిస్తున్నట్టు ప్రపంచ బ్యాంక్‌ ప్రకటించింది. . ఇకపై ఈ కంపెనీలు ఎలాంటి కార్యకలాపాలూ నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేసినట్టు ప్రపంచ బ్యాంకు తన వార్షిక నివేదిక ద్వారా వెల్లడించింది. భారత్‌కు చెందిన ఆలివ్‌ హెల్త్‌కేర్‌, జై మోదీ కంపెనీలు అవినీతికి పాల్పడుతున్నట్లు సమాచారం రావడంతో వాటిని నిషేధిస్తున్నట్లు పేర్కొంది. ఈ కంపెనీలు బంగ్లాదేశ్‌లో ప్రపంచ బ్యాంక్‌ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నాయి. ఆలివ్‌ హెల్త్‌పై 10 ఏళ్ల ఆరు నెలలు నిషేధం విధించగా.. జై మోదీని ఏడేళ్ల ఆరు నెలలు డిబార్‌ చేసింది..  

అదేవిధంగా భారత్‌కు చెందిన ఏంజెలిక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌పై కూడా నాలుగేళ్ల ఆరు నెలలు నిషేధం విధించింది. ఈ కంపెనీ ఇథియోపియా, నేపాల్‌లో ప్రపంచ బ్యాంక్‌ ప్రాజెక్ట్‌లో పాల్గొంటుంది. ఫ్యామిలీ కేర్‌పై నాలుగేళ్లు నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ కంపెనీ అర్జెంటీనా, బంగ్లాదేశ్‌ దేశాల ప్రాజెక్ట్‌లో ఉంది. ఇక భారత్‌లో ప్రాజెక్టులు నిర్వహిస్తున్న మధుకాన్‌ ప్రాజెక్టు లిమిటెడ్‌పై రెండేళ్లు, ఆర్‌కేడీ కన్‌స్ట్రక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై ఏడాది ఆరు నెలల పాటు నిషేధం విధించినట్లు ప్రపంచ బ్యాంకు తన నివేదికలో వెల్లడించింది. వీటితో పాటు తత్వే గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎస్‌ఎంఈసీ(ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌, మాక్లోడ్స్‌ ఫార్మాసిటికల్స్‌ లిమిటెడ్‌పై ఏడాది కంటే తక్కువ కాలం నిషేధం విధించింది. ఈ 78 కంపెనీలతో పాటు మరో ఐదు కంపెనీలపై కూడా ఆంక్షలతో కూడిన నిబంధనలు విధించింది. ప్రపంచ బ్యాంక్‌ ఫండ్‌ చేసే ప్రాజెక్ట్‌ల్లో ఈ కంపెనీలు అవినీతి, మోసం, కుట్రలు, అవరోధాలకు పాల్పడుతున్నాయని తన నివేదికలో వెల్లడించింది.

మరిన్ని వార్తలు