ఎస్జీఎక్స్ నిఫ్టీ 85 పాయింట్లు అప్
నిఫ్టీకి 10,798-10,857 వద్ద రెసిస్టెన్స్
గురువారం యూఎస్, యూరోప్ మార్కెట్లు డౌన్
ప్రస్తుతం ఆసియా మార్కెట్లు సానుకూలం
నేడు (17న) దేశీ స్టాక్ మార్కెట్లు ప్రోత్సాహకరంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ 85 పాయింట్లు ఎగసి 10,783 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ జులై నెల ఫ్యూచర్స్ 10,698 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కోవిడ్-19 కేసుల విస్తృతి, టెక్నాలజీ దిగ్గజాలలో అమ్మకాలతో గురువారం యూఎస్ మార్కెట్లు 0.3-0.7 శాతం మధ్య నీరసించాయి. అంతకుముందు యూరోపియన్ మార్కెట్లు సైతం 0.5 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. అయితే ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో సానుకూల ధోరణి కనిపిస్తోంది. దీంతో నేడు వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభంకావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే తదుపరి యధాప్రకారం ఆటుపోట్లను చవిచూసే వీలున్నట్లు భావిస్తున్నారు.
ఐటీ, ఫార్మా పుష్
కోవిడ్-19కు వ్యాక్సిన్పై ఆశలతో ప్రపంచ మార్కెట్లు బలపడటంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. దీంతో గురువారం దేశీ స్టాక్ మార్కెట్లు తొలుత కొంత ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ తదుపరి కొనుగోళ్లదే పైచేయికావడంతో లాభపడ్డాయి. చివరి గంటన్నర సమయంలో మరింత దూకుడు చూపాయి. వెరసి సెన్సెక్స్ 420 పాయింట్లు జంప్చేసి 36,472 వద్ద నిలవగా.. నిఫ్టీ 122 పాయింట్లు జమ చేసుకుని 10,740 వద్ద ముగిసింది.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 10,638 పాయింట్ల వద్ద, తదుపరి 10,537 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 10,798 పాయింట్ల వద్ద, ఆపై 10,857 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 21,193 పాయింట్ల వద్ద, తదుపరి 20,789 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్ నిఫ్టీకి తొలుత 21,836 పాయింట్ల వద్ద, తదుపరి 22,075 స్థాయిలో రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.
ఎఫ్పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1091 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1660 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. బుధవారం ఎఫ్పీఐలు రూ. 222 కోట్లు, డీఐఐలు రూ. 899 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. ఇక మంగళవారం సైతం ఎఫ్పీఐలు దాదాపు రూ. 1566 కోట్లు, డీఐఐలు రూ. 650 కోట్లు చొప్పున అమ్మకాలు చేపట్టాయి.