ఎస్జీఎక్స్ నిఫ్టీ 36 పాయింట్లు వీక్
యూఎస్ మార్కెట్లు 2 శాతం అప్
అటూఇటుగా ఆసియా స్టాక్ మార్కెట్లు
నేడు(గురువారం) దేశీ స్టాక్ మార్కెట్లు కొంతమేర ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్జీఎక్స్ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతంలో 36 పాయింట్లు క్షీణించి 9,050 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ మే నెల ఫ్యూచర్స్ 9,086 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. లాక్డవున్ను ఎత్తివేస్తున్న నేపథ్యంలో నెమ్మదిగా ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టవచ్చంటూ ఫెడరల్ రిజర్వ్ చైర్మన జెరోమీ పావెల్ పేర్కొన్న నేపథ్యంలో బుధవారం మరోసారి అమెరికా స్టాక్ మార్కెట్లు 1.5-2 శాతం మధ్య ఎగశాయి. అయితే ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. కాగా..లాక్డవున్లోనూ కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్న కారణంగా దేశీయంగా సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో నేడు దేశీ స్టాక్ మార్కెట్లు బలహీనంగా ప్రారంభమైనప్పటికీ తదుపరి ఆటుపోట్లను చవిచూడవచ్చని భావిస్తున్నారు. కాగా.. బుధవారం సెన్సెక్స్ 622 పాయింట్లు జంప్చేసి 30,819 వద్ద నిలవగా.. నిఫ్టీ 187 పాయింట్లు బలపడి 9,067 వద్ద ముగిసిన విషయం విదితమే.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 8,955 పాయింట్ల వద్ద, తదుపరి 8,800 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు జోరందుకుంటే..నిఫ్టీకి తొలుత 9,150 పాయింట్ల వద్ద, ఆపై 9,240 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 17,600 పాయింట్ల వద్ద, తదుపరి 17400 వద్దపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు.ఒకవేళ పుంజుకుంటే తొలుత 18070 పాయింట్ల వద్ద, తదుపరి 18300 స్థాయిలో రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.
విక్రయాల బాటలోనే..
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దాదాపు రూ. 1467 కోట్ల అమ్మకాలు చేపట్టగా.. దేశీ ఫండ్స్ (డీఐఐలు) రూ. 2373 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. మంగళవారం ఎఫ్పీఐలు రూ. 1328 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 1660 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. ఇక సోమవారం ఎఫ్పీఐలు రూ. 2513 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టగా.. దేశీ ఫండ్స్ సైతం రూ. 152 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన సంగతి తెలిసిందే.