అన్ని కాలాల్లోనూ పెట్టుబడులకు అనుకూలం..!

7 Oct, 2019 05:26 IST|Sakshi

ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఈక్విటీ ఫండ్‌

ఈక్విటీ మార్కెట్లలో సాధారణంగా అస్థిరతలు ఉంటుంటాయి. కానీ, కొన్ని సందర్భాల్లో ఇవి అసాధారణ స్థాయికి చేరుతుంటాయి. ముఖ్యంగా ఈ తరహా ఆటుపోట్లు, అనిశ్చిత పరిస్థితుల్లో మల్టీక్యాప్‌ విభాగం ఈక్విటీ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుంటుంది. ఎందుకంటే ఈ విభాగంలోని మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు కేవలం ఒక విభాగానికే పరిమితం కాకుం డా.. చిన్న, మధ్య, పెద్ద స్థాయి ఇలా అన్ని ర కాల మార్కెట్‌ విలువతో కూడిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వెసులుబాటుతో ఉంటాయి.

మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా స్పందించే వెసులుబాటు వీ టి కి ఉంటుంది. అయినప్పటికీ ఈ పథకాలు లార్జ్‌క్యాప్‌నకు, మధ్య స్థాయి విభాగంలోని పెద్ద కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి. ఎందుకంటే వీటిల్లో లిక్విడిటీ ఎక్కువగా ఉండడం వల్ల అవసరమైన సందర్భాల్లో వేగంగా విక్రయించేందుకు వీలుంటుంది. అలాగే, అధిక రాబడుల కోసం స్మాల్, మిడ్‌క్యాప్‌లోనూ కొంత మేర ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. మల్టీక్యాప్‌ విభాగంలో ఇన్వెస్టర్లు తప్పక పరిశీలించాల్సిన పథకాల్లో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ (ఏబీఎస్‌ఎల్‌) ఈక్విటీ ఫండ్‌ ప్రధానమైనది.    

రాబడులు
ఏబీఎస్‌ఎల్‌ ఈక్విటీ ఫండ్‌లో మిడ్, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ వాటా సాధారణంగా 25 నుంచి 35 శాతం మధ్య ఉంటుంది. మిగిలిన పెట్టుబడులను ఈ పథకం లార్జ్‌క్యాప్‌ కంపెనీలకు కేటాయిస్తుంది. ఇది డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్‌. 1998లో ఈ పథకం ఆరంభం కాగా, నాడు రూ.లక్ష ఇన్వెస్ట్‌ చేసి ఉంటే 2017 నాటికి రూ.73 లక్షలు అయ్యేవి. 73 రెట్లు వృద్ధి చెందినట్టు. దీర్ఘకాలంలో ఈ పథకం చక్కని పనితీరును చూపించింది. మూడేళ్ల కాలంలో ఏబీఎస్‌ఎల్‌ ఈక్విటీ పథకం వార్షికంగా 11.47 శాతం చొప్పున రాబడులను ఇవ్వగా, ఇదే కాలంలో బీఎస్‌ఈ 200 టోటల్‌ రిటర్న్‌ ఇండెక్స్‌ ఇచ్చిన వార్షిక రాబడులు 12.22 శాతంగా ఉన్నాయి.

కానీ ఐదేళ్ల కాలంలో మాత్రం బీఎస్‌ఈ 200 రాబడులు 10.55 శాతంతో పోలిస్తే.. ఏబీఎస్‌ఎల్‌ ఈక్విటీ ఫండ్‌ అధికంగా, 11.38 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇన్వెస్టర్లకు పంచింది. ఏడేళ్లలో 16.86 శాతం, పదేళ్ల కాలంలో 14.34 శాతం, 12 ఏళ్లలో 10.59 శాతం, 15 ఏళ్లలో 18.99 శాతం చొప్పున వార్షిక రాబడులను ఏబీఎస్‌ఎల్‌ ఈక్విటీ పథకం ఇచ్చింది. ఆరంభం నుంచి చూసుకుంటే బీఎస్‌ఈ 200కు మించి పనితీరు చూపించడమే కాకుండా, 22.64 శాతం చొప్పున కాంపౌండెడ్‌ వార్షిక ప్రతిఫలాన్ని ఇచ్చింది.

పెట్టుబడుల విధానం
ఈ పథకం పెట్టుబడుల విధానం టాప్‌డౌన్, బోటమ్‌ అప్‌ విధానాల మిశ్రమంగా ఉంటుంది.  బోటమ్‌అప్‌ స్టాక్‌ ఎంపికలో భాగంగా ఫండ్‌ మేనేజర్‌.. ఏ కంపెనీలు ప్రస్తుత స్థాయి నుంచి మంచిగా వృద్ధి చెందగలవన్నది చూసి వాటిల్లో ఇన్వెస్ట్‌ చేస్తారు. ఈ పథకం ప్రైవేటు బ్యాంకులు, మెటల్స్, ఫార్మా, సిమెంట్‌ రంగాల స్టాక్స్‌ పట్ల అధిక వెయిటేజీతో ఉంది. ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, డాక్టర్‌ రెడ్డీస్, ఐటీసీలో అధిక పెట్టుబడులు కలిగి ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ       బ్యాంకు విషయానికొస్తే.. మంచి ఆస్తుల     నాణ్యత, బలమైన రిటైల్‌ ఫ్రాంచైజీ కలిగిన బ్యాంకు. 20 శాతానికి పైగా ఎర్నింగ్స్‌ వృద్ధి కారణంగా ఈ స్టాక్‌ అధిక వ్యాల్యూషన్‌ కొనసాగుతుంది. ఐసీఐసీఐ బ్యాంకు టర్న్‌ అరౌండ్‌ స్టోరీ. ఐటీసీ ఇతర కన్జ్యూమర్‌ స్టాపుల్‌ స్టాక్స్‌తో పోలిస్తే     చౌకగా ఉంది. ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో దృష్ట్యా రానున్న 15–18 నెలల కాలానికి డాక్టర్‌ రెడ్డీస్‌ ఆకర్షణీయంగా ఉంది.  


డి.జయంత్‌కుమార్‌
థర్డ్‌పార్టీ ప్రొడక్ట్స్‌ హెడ్, కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌

మరిన్ని వార్తలు