ఈ వారంలోనే ఒప్పందం!
న్యూఢిల్లీ: ఆతిధ్య రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓయో సంస్థలో సింగపూర్ దేశానికి చెందిన రవాణా సేవలందించే సంస్థ, గ్రాబ్ రూ.700 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టనున్నది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయని, ఈ వారంలోనే ఈ డీల్ కుదరవచ్చని సమాచారం. గ్రాబ్, ఓయో కంపెనీలు తమ కీలక మార్కెట్లుగా ఇండోనేషియాను, ఆగ్నేయాసియాలను గుర్తించాయి.
ఈ ఏడాది అక్టోబర్లో ఇండోనేషియాలో కార్యకలాపాలు ప్రారంభించిన ఓయో... విస్తరణలో భాగంగా 10 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నామని అప్పుడే వెల్లడించింది. ఇండోనేషియాలో 35 నగరాలకు కార్యకలాపాలు విస్తరించనున్నామని ఓయో వ్యవస్థాపకులు, సీఈఓ కూడా అయిన రితేశ్ అగర్వాల్ గతంలో పేర్కొన్నారు.