స్కెచర్స్‌ చేతికి 49% ఫ్యూచర్స్‌ వాటా 

14 Feb, 2019 00:42 IST|Sakshi

డీల్‌ విలువ రూ.600 కోట్లు! 

న్యూఢిల్లీ: స్కెచర్స్‌ ఇండియా జాయింట్‌ వెంచర్‌లో ఫ్యూచర్స్‌ గ్రూప్‌నకు ఉన్న 49% వాటాను మాతృ కంపెనీ స్కెచర్స్‌ యూఎస్‌ఏ కొనుగోలు చేసింది. ఈ కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక వివరాలను ఇరు కంపెనీలు  వెల్లడించలేదు.  అయితే ఈ వాటా కొనుగోలు కోసం అమెరికాకు చెందిన స్కెచర్స్‌ కంపెనీ రూ.600 కోట్లు వెచ్చించిందని సమాచారం. దీంతో స్కెచర్స్‌ ఇండియా  ఇక పూర్తిగా స్కెచర్స్‌ యూఎస్‌ఏ అనుబంధ సంస్థగా మారిపోయింది.  

మరింతగా వృద్ధి జోరు... 
ఇతర దేశాల్లో లాగానే ఆకర్షణీయమైన వృద్ధి అవకాశాలతో భారత్‌లోకి ప్రవేశించామని స్కెచర్స్‌ సీఎఫ్‌ఓ డేవిడ్‌ వీన్‌బర్గ్‌ చెప్పారు. జాయింట్‌ వెంచర్‌లో మైనారిటీ వాటాను కొనుగోలు చేశామన్నారు. ఈ కొనుగోలు స్కెచర్స్‌ ఇండియా వృద్ధి జోరును మరింతగా పెంచుతుందని స్కెచర్స్‌ సౌత్‌ ఏషియా సీఈఓ రాహుల్‌ విరా పేర్కొన్నారు. కార్యకలాపాల విస్తరణను మరింత వేగవంతం చేస్తుందని, భారత్‌లో మరింత మార్కెట్‌ వాటా కొనుగోలు కోసం పటిష్టమైన నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయడానికి ఈ కొనుగోలు దోహదం చేస్తుందని వివరించారు. 

ఈ ఏడాది 80 నుంచి వంద కొత్త స్టోర్స్‌.... 
స్కెచర్స్‌ కంపెనీ ఫ్యూచర్‌ గ్రూప్‌తో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు ద్వారా భారత్‌లో 2012లో ప్రవేశించింది.  ప్రస్తుతం భారత్‌లో స్కెచర్స్‌ కంపెనీ 223 రిటైల్‌ స్టోర్స్‌ను నిర్వహిస్తోంది. వీటిల్లో 61 స్వంత స్టోర్స్‌ కాగా, మిగిలినవి థర్డ్‌ పార్టీ ఆధ్వర్యంలోనివి. ఈ ఏడాది కొత్తగా 80 నుంచి వంద స్టోర్స్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. 

మరిన్ని వార్తలు