స్కిప్పర్‌ హైజంప్‌- మోర్పెన్‌ వీక్‌

23 Jun, 2020 10:28 IST|Sakshi

Q4 ఫలితాల ఎఫెక్ట్‌

20 శాతం ఎగసిన స్కిప్పర్‌ షేరు

తొలుత లాభాలు- ఆపై నష్టాలు

మోర్పెన్‌ ల్యాబ్స్‌ షేరు తీరిది

వరుసగా మూడో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం(2019-520) చివరి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు విద్యుత్‌ రంగ టవర్ల తయారీ కంపెనీ స్కిప్పర్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ను పెంచాయి. అయితే మరోపక్క గతేడాది క్యూ4(జనవరి-మార్చి) ఫలితాలు వెల్లడించిన హెల్త్‌కేర్‌ కంపెనీ మోర్పెన్ ల్యాబొరేటరీస్‌ కౌంటర్‌ ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. వివరాలు చూద్దాం..

స్కిప్పర్‌ లిమిటెడ్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో విద్యుత్‌ టవర్లు, పీవీసీ పైపుల తయారీ కంపెనీ స్కిప్పర్‌ లిమిటెడ్‌ ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. నికర లాభం 58 శాతంపైగా జంప్‌చేసి రూ. 28 కోట్లను అధిగమించింది. అమ్మకాలు మాత్రం నామమాత్ర వృద్ధితో రూ. 439 కోట్లకు చేరాయి. పూర్తిఏడాదికి(2019-20)నికర లాభం 32 శాతం ఎగసి రూ. 41 కోట్లను తాకింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి 10 శాతం డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో స్కిప్పర్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికమై రూ. 47 వద్ద ఫ్రీజయ్యింది.

మోర్పెన్‌ ల్యాబ్‌
ఫార్మా రంగ కంపెనీ మోర్పెన్‌ ల్యాబ్‌ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర లాభం 5 శాతం పుంజుకుని రూ. 11 కోట్లను అధిగమించింది. అమ్మకాలు మాత్రం 5.5 శాతం క్షీణించి రూ. 207 కోట్లకు చేరాయి. పన్నుకు ముందు లాభం 6 శాతం బలపడి రూ. 11.4 కోట్లను తాకింది. అయితే నిర్వహణ లాభం 9 శాతం నీరసించి రూ. 21 కోట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో మోర్పెన్‌ ల్యాబ్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో తొలుత 5 శాతం ఎగసి రూ. 31.4ను తాకింది. తదుపరి అమ్మేవాళ్లు అధికమై 4 శాతం పతనమైంది. ప్రస్తుతం రూ. 29 దిగువన ట్రేడవుతోంది.


 

మరిన్ని వార్తలు