రుచి సోయాకు పతంజలి  రూ. 4 వేల కోట్ల ఆఫర్‌

8 May, 2018 00:25 IST|Sakshi

న్యూఢిల్లీ: దివాలా తీసిన వంటనూనెల సంస్థ రుచి సోయా కొనుగోలు కోసం కంపెనీలు పోటాపోటీగా బిడ్లు వేస్తున్నాయి. తాజాగా యోగా గురు బాబా రామ్‌దేవ్‌కి చెందిన పతంజలి ఆయుర్వేద ఏకంగా రూ.4,000 కోట్ల పైచిలుకు ఆఫర్‌ చేసినట్లు సమాచారం. ఇప్పటికే అదానీ విల్మర్, ఇమామి ఆగ్రోటెక్, గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ తదితర సంస్థలు రుచి సోయా కోసం పోటీపడుతూ బిడ్లు దాఖలు చేశాయి. ఇండోర్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న రుచి సోయా రుణభారం ప్రస్తుతం రూ.12,000 కోట్లకు పైగా ఉంది.

న్యూట్రెలా, మహో కోశ్, సన్‌రిచ్, రుచి స్టార్, రుచి గోల్డ్‌ తదితర బ్రాండ్స్‌ పేరిట ఉత్పత్తులు విక్రయిస్తోంది. భారీ మొండిబాకీల నేపథ్యంలో దివాలా చట్టం కింద చర్యలకు ఆదేశించిన నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌... రుణ సమస్య పరిష్కారం దిశగా కంపెనీ అమ్మకానికి ప్రత్యేక నిపుణుడిని (ఐఆర్‌పీ) నియమించగా.. ప్రస్తుతం బిడ్స్‌ దాఖలు ప్రక్రియ జరుగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో రుచి సోయా షేర్లు 7 శాతం ఎగిశాయి. బీఎస్‌ఈలో కంపెనీ షేరు ఇంట్రా–డేలో దాదాపు 20 శాతం పెరిగి 16.05 స్థాయిని తాకి, చివరికి 7.09 శాతం లాభంతో రూ. 14.35 వద్ద క్లోజయ్యింది. అటు ఎన్‌ఎస్‌ఈలో 4 శాతం లాభంతో రూ. 14 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో దాదాపు 33.89 లక్షల షేర్లు, ఎన్‌ఎస్‌ఈలో 3 కోట్ల మేర
షేర్లు చేతులు మారాయి.  

మరిన్ని వార్తలు