జీఎస్‌టీ మోసాల  నివారణకు ప్రత్యేక వ్యవస్థ

8 May, 2018 00:22 IST|Sakshi

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల విధానాన్ని అమలు చేసే జీఎస్‌టీ నెట్‌వర్క్‌ కేవలం పన్ను వసూళ్ల పోర్టల్‌గానే కాకుండా.. జీఎస్‌టీ పరమైన మోసాలను ముందుగానే పసిగట్టడంపై కూడా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా ఫ్రాడ్‌ అనలిటిక్స్‌ సిస్టమ్‌ను (ఎఫ్‌ఏఎస్‌) డిజైన్, అభివృద్ధి చేసేందుకు ప్రైవేట్‌ సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. బిడ్‌ ప్రతిపాదన (ఆర్‌ఎఫ్‌పీ) ప్రకారం ఎఫ్‌ఏఎస్‌ రూపకల్పనకి ఏడాది వ్యవధి ఉంటుంది. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్, రిటర్నుల దాఖలు, ఈ–వేబిల్స్‌తో పాటు ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఎఫ్‌ఐయూ), సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ (సీబీడీటీ), బ్యాంకులు, రాష్ట్రాల ఆదాయ పన్నుల శాఖల దగ్గరనుంచి వచ్చే సమాచారం అంతా క్రోడీకరించి .. పన్ను చెల్లింపుదారుల వివరాలు అన్ని కోణాల్లో సమగ్రంగా లభ్యమయ్యేలా ఎఫ్‌ఏఎస్‌ వ్యవస్థ ఉండనుంది.

దాదాపు రూ. 300 కోట్ల టర్నోవరు, గడిచిన మూడేళ్లలో లాభాలు నమోదు చేసిన కంపెనీలు బిడ్లను దాఖలు చేయొచ్చు. అడ్వాన్స్‌డ్‌ ఆనలిటిక్స్‌ను అమలు చేయడంలో అనుభవం ఉండాలి. అర్హత పొందిన సంస్థ ఆరేళ్ల పాటు సేవలు అందించాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటికే జీఎస్‌టీఎన్‌కి సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ను అందించిన కారణంగా ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ మాత్రం ఈ బిడ్డింగ్‌లో పాల్గొనడానికి వీలుండదు.  

మరిన్ని వార్తలు