700, 900 బ్యాండ్లలో ఒక్క బిడ్ రాలేదు

4 Oct, 2016 01:07 IST|Sakshi
700, 900 బ్యాండ్లలో ఒక్క బిడ్ రాలేదు

స్పెక్ట్రమ్ వేలం రెండో రోజు
పలు సర్కిళ్లలో అధిక స్పందన

న్యూఢిల్లీ: కేంద్ర టెలికం శాఖ నిర్వహిస్తున్న స్పెక్ట్రమ్ వేలంలో రెండో రోజైన సోమవారం ముంబై, రాజస్తాన్, గుజరాత్ సర్కిళ్లలో అధిక బిడ్లు దాఖలు అయ్యాయి. అత్యంత ఖరీదైన 700 మెగాహెడ్జ్‌తోపాటు 900 మెగాహెడ్జ్ బ్యాండ్‌లో ఇంత వరకు ఒక్క బిడ్ కూడా నమోదు కాలేదు. మొదటి రెండు రోజుల్లో మూడు రౌండ్ల వేలం పూర్తయింది. ఈ నెల 1న మొదటి రోజు ఐదు మొబైల్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లలో స్పెక్ట్రమ్ కోసం రూ.53,531 కోట్ల విలువైన బిడ్లు దాఖలు అయ్యాయి. ఆదివారం సెలవు కావడంతో సోమవారం రెండో రోజు వేలం కొనసాగింది. ఈ స్పెక్ట్రమ్ వేలం ఎప్పుడు ముగిసేదీ టెలికం శాఖ ఇంతవరకు ప్రకటించలేదు.

అధిక ఆదరణ వీటికే..: 1800 మెగాహెడ్జ్ బ్యాండ్‌విడ్త్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్‌కు టెల్కోల నుంచి మంచి స్పందన వస్తోంది. మహారాష్ట్ర ముంబై సహా ఐదు సర్కిళ్లలో ఈ బ్యాండ్‌విడ్త్ కోసం అధిక బిడ్లు వచ్చాయి. అలాగే, 2300, 2100, 2500 మెగాహెడ్జ్ బ్యాండ్‌లకూ ఆదరణ బావున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. రూ.5.63 లక్షల కోట్ల ఆదాయ అంచనాతో కేంద్రం 2,354.55 మెగాహెడ్జ్ ఫ్రీక్వెన్సీలను వేలానికి ఉంచింది.

మరిన్ని వార్తలు