దేశాభిమాన బ్రాండ్‌గా ఎస్‌బీఐ

14 Aug, 2018 02:00 IST|Sakshi

ముంబై: దేశాభిమానాన్ని అత్యధికంగా ప్రతిబింబించే బ్రాండ్స్‌ జాబితాలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) అగ్రస్థానంలో నిల్చింది. బ్రిటన్‌కి చెందిన ఆన్‌లైన్‌ మార్కెట్‌ రీసెర్చ్, డేటా అనలిటిక్స్‌ సంస్థ యూగవ్‌ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 16 శాతం మంది.. ఈ విషయంలో ఎస్‌బీఐకి ఓటేశారు. ఇక ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్, పతంజలి సంస్థ చెరి 8 శాతం ఓటింగ్‌తో తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

టెలికం సంస్థలు రిలయన్స్‌ జియో, బీఎస్‌ఎన్‌ఎల్‌ చెరి 6 శాతం ఓట్లు దక్కించుకున్నాయి. రంగాల వారీగా చూస్తే అత్యధిక దేశాభిమాన బ్రాండ్స్‌తో ఆర్థిక రంగం అగ్రస్థానం దక్కించుకుంది. ఆటోమొబైల్, కన్జూమర్‌ గూడ్స్, ఫుడ్, టెలికం రంగాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆగస్టు 2 నుంచి 8 మధ్యలో.. మొత్తం 11 రంగాలు, 152 బ్రాండ్స్‌పై యూగవ్‌ ఈ సర్వే నిర్వహించింది.

బ్యాంకుల పరిస్థితేమీ బాగులేదు: ఫిచ్‌
పేరుకుపోయిన మొండిబాకీల భారం, పేలవ పనితీరును అధిగమించి మూలధన పరిమాణాన్ని మెరుగుపర్చుకునే దాకా భారత బ్యాంకుల పరిస్థితి ప్రతికూలంగానే ఉండనుందని అంతర్జాతీయ రేటింగ్స్‌ ఏజెన్సీ ఫిచ్‌ రేటింగ్స్‌ పేర్కొంది.  బ్యాంకింగ్‌ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకూ నెగిటివ్‌ రేటింగ్‌  తప్పదని విశ్లేషించింది.

>
మరిన్ని వార్తలు