రేట్ల కోత లాభాలు

14 Sep, 2019 02:15 IST|Sakshi

పెరిగిన ద్రవ్యోల్బణం  తగ్గిన పారిశ్రామికోత్పత్తి

బలం పుంజుకున్న రేట్ల కోత అంచనాలు  281 పాయింట్ల లాభంతో 37,385కు సెన్సెక్స్‌  93 పాయింట్లు పెరిగి 11,076కు నిఫ్టీ 

ఆగస్టు నెలలో ద్రవ్యోల్బణం పది నెలల గరిష్టానికి ఎగసింది. దీంతో ఆర్‌బీఐ రేట్లను తగ్గించగలదన్న అంచనాలతో శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. అమెరికా–చైనాల మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలుండటం,ఆర్థిక వృద్ధికి జోష్‌నివ్వడానికి యూరోప్‌ కేంద్ర బ్యాంక్‌ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లు పెరగడం కలసివచి్చంది. డాలర్‌లో రూపాయి మారకం విలువ పుంజుకోవడం, విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ మన స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెడుతుండటం, ముడి చమురు ధరలు తగ్గడం... సానుకూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్‌ ఒడిదుడుకుల్లో ట్రేడైనప్పటికీ చివరి గంటన్నరలో జరిగిన కొనుగోళ్ల జోరు కారణంగా లాభాల్లో ముగిసింది. రోజంతా 414 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్‌ 281 పాయింట్ల లాభంతో 37,385 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 93 పాయింట్లు పెరిగి 11,076 పాయిం ట్ల వద్ద ముగిశాయి. వడ్డీరేట్ల ప్రభావిత బ్యాంక్, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు, వాహన, రియల్టీ షేర్లతో పాటు ఐటీ,  షేర్లు కూడా లాభపడ్డాయి.  ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్‌403 పాయింట్లు, నిఫ్టీ 130 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

414 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌... 
గురువారం మార్కెట్‌ ముగిసిన తర్వాత ఆర్థిక గణాంకాలు వెలువడ్డాయి. జూలై పారిశ్రామికోత్పత్తి 4.3 శాతమే వృద్ది చెందగా, ఆగస్టులో రిటైల్‌ ద్రవ్యోల్బణం పది నెలల గరిష్టానికి, 3.21 శాతానికి ఎగసింది. దీంతో వచ్చే నెల పాలసీలో భాగంగా ఆర్‌బీఐ కీలక రేట్లను తగ్గించగలదన్న అంచనాలు బలం పుంజుకున్నాయి. సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైనప్పటికీ, మధ్యాహ్నం వరకూ లాభ, నష్టాల మధ్య దోబూచులాడింది. చివరి గంటన్నరలో కొనుగోళ్లు జోరుగా సాగాయి. ఒక దశలో 104 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, మరో దశలో 310 పాయింట్లు లాభపడింది. మొత్తం మీద రోజంతా 414 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.  

రియల్టీ షేర్ల జోరు.... 

  • రియల్టీ రంగంలో చోటు చేసుకున్న మందగమనాన్ని ఎదుర్కొనడానికి ప్రభుత్వం కొన్ని చర్యలను ప్రకటించగలదన్న అంచనాలతో రియల్టీ షేర్లు లాభపడ్డాయి. డీఎల్‌ఎఫ్‌ 4 శాతం, గోద్రేజ్‌ ప్రొపరీ్టస్‌ 1.5%, ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌ 1.4%, చొప్పున లాభపడ్డాయి.  
  • ఖదిమ్‌ ఇండియా షేర్‌ లాభాలు మూడో రోజూ కొనసాగాయి. 15% లాభంతో రూ.270 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 18% లాభంతో రూ.280ను తాకింది. ఈ కంపెనీ బంగ్లాదేశ్‌లో తన పూర్తి అనుబంధ సంస్థ, ఖదిమ్‌ షూ బంగ్లాదేశ్‌ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ షేర్‌ పెరుగుతోంది.
     
మరిన్ని వార్తలు